రేపటినుండి డీఎస్సీ సెలెక్ట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2024 డిఎస్సి నియామక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుండి ఐదవ తేదీ వరకు పూర్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు.

Update: 2024-09-30 14:50 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2024 డిఎస్సి నియామక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుండి ఐదవ తేదీ వరకు పూర్తి చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఆగమేఘాలపై ఏర్పాట్లు చేస్తున్నారు. రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు సోమవారం విడుదల చేసిన ప్రక్రియను కొత్త ఉపాధ్యాయుల నియామకాలను దసరా లోపు పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో సర్టిఫికెట్ల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మొత్తం 243 పోస్టులకు గాను 729 మందిని రాత పరీక్షలో మార్కుల ఆధారంగా సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని డైట్ కళాశాల లో నిర్వహించనున్నారు. ఇందుకుగాను మొత్తం 12 టీంలను ఏర్పాటు చేశారు.

నారాయణపేట జిల్లాలో 279 పోస్టులకు గాను 837 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. వీరందరికీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్సీ హాస్టల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 172 పోస్టులకు గాను 516 మంది అభ్యర్థులకు జిల్లా పరిషత్ బాలుర స్కూల్‌లో సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. వనపర్తి జిల్లాలోని మొత్తం 152 పోస్టులకు 456 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను గాంధీ చౌక్ సమీపంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పరిశీలిస్తారు. నాగర్ కర్నూల్ జిల్లాకు సంబంధించిన 285 పోస్టులకు గాను 885 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో పరిశీలిస్తారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించనున్న ఈ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమానికి హాజరయ్యే అభ్యర్థులు తమ దరఖాస్తు పత్రం తో పాటు, గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరణతో రెండు సెట్ల జిరాక్స్ పత్రాలు, ఒరిజినల్ పత్రాలతో హాజరుకావాలని డీఈవోలు రవీందర్, గోవిందరాజులు వేరు వేరు ప్రకటనలో తెలిపారు.


Similar News