మెడికల్ కళాశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి

నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం నారాయణపేట మెడికల్ కళాశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా అధికారులను ఆదేశించారు.

Update: 2024-10-16 14:22 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి : నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం నారాయణపేట మెడికల్ కళాశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాలలో కేవలం ఒక సంవత్సరం తరగతులు కావాల్సిన వసతులే కాకుండా ద్వితీయ సంవత్సరం నిర్వహించేందుకు అవసరమైన వసతి సౌకర్యం సమకూర్చాలని ఆమె సూచించారు. బుధవారం నారాయణపేట మెడికల్ కళాశాలను జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ తో కలిసి పరిశీలించారు. కళాశాల మీటింగ్ హాల్ లో కళాశాల ప్రిన్సిపాల్, టీజీఎంఐడీసీ అధికారులు, కళాశాల వైద్య నిపుణులతో ఆమె మెడికల్ కళాశాల నిర్వహణపై సమీక్షించారు. మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు ఏమేమి వసతులు కావాలని, ఇప్పటివరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారని ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు.

    ముఖ్యంగా అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలకు సంబంధించి ఎలాంటి పరికరాలు అవసరమని ఆయా విభాగాల వైద్య నిపుణులతో చర్చించారు. ఒకసారి కళాశాల తరగతులు ప్రారంభించిన తర్వాత మళ్లీ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకూడదని తెలిపారు. తరగతుల కు సరిపడా ఫర్నిచర్ వచ్చిందా? ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఇండెంట్ పంపించాలని కోరారు. ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రెండో సంవత్సరం తరగతుల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే మెడికల్ కళాశాల 3వ అంతస్తులో బ్లడ్ బ్యాంక్, డయాలసిస్, ఇతర ల్యాబ్ లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వెనుకబడిన ఈ ప్రాంతంలో వైద్యపరంగా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని, అందుకోసం సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆమె సూచించారు.

    అంతకుముందు జిల్లా కలెక్టర్ అధికారుల బృందంతో కలిసి ఆమె నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని, చిన్నపిల్లల ఆస్పత్రిని పరిశీలించారు. చిన్నపిల్లల ఆసుపత్రిలోని వార్డులను తిరిగి, అక్కడి వైద్య సదుపాయాలను చూశారు. చిన్నపిల్లలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి మేల్, ఫిమేల్ వార్డులలో చికిత్స పొందుతున్న రోగులు, చిన్నపిల్లల తల్లులతో మాట్లాడి ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు చేసుకోవాలని ఆమె సూచించారు. ఆస్పత్రిలోని ఫార్మసీ, ఆరోగ్య మహిళ, ఐసీటీసీ విభాగాలకు వెళ్లి రోజుకు ఎంతమంది వస్తున్నారని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

    ఫార్మసీలో ఏఏ మందుల కొరత ఉందని తెలుసుకున్న ఆమె వాటి ఇండెంట్ ను పంపించాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని మెటర్నటీ వార్డును, ఆవరణలోని పీపీ యూనిట్ ను ఆమె పరిశీలించారు. చివరగా రాత్రి ఏడు గంటలకు ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారుల బృందం పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని ఎంసీహెచ్ ( మదర్ అండ్ చైల్డ్ హెల్త్) విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎంఐడీసీ ఎండీ. హేమంత్, ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల, అకాడమిక్ డీఎంఈ శివరాం ప్రసాద్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లికార్జున్ పాల్గొన్నారు. 

Tags:    

Similar News