చీకటి దందా షురూ.. యథేచ్ఛగా ఇసుక, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా

మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండల పరిధిలో చీకటి దందాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

Update: 2024-09-23 02:38 GMT

దిశ, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండల పరిధిలో చీకటి దందాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆకేరు వాగు పరిసర ప్రాంతాలైన కొమ్ములవంచ, జయపురం, కౌసల్యదేవిపల్లి గ్రామాలు అక్రమాలకు ఆదాయ వనరులుగా మారాయి. రాత్రయితే చాలు ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తూ సహజ సంపదను కొల్లగొడుతున్నారు. పర్మీషన్ లేకున్నా ఇసుక తరలిస్తున్నారని ప్రశ్నిస్తే అధికారుల అండదండలు ఉన్నాయని, ఇష్టం ఉన్నచోట చెప్పుకోండంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఇసుక తరలింపు విషయమై జరిగిన గొడవలో కౌసల్యదేవిపల్లికి చెందిన రైతు, ట్రాక్టర్ యజమాని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రేషన్ షాపుల ద్వారా సరఫరా అవుతున్న పీడీఎస్ బియ్యం రాత్రి 10 దాటితే చాలు ఆటోల్లో తరలిస్తున్నారు. ప్రతినెల 15 నుంచి 20 వరకు ఇదే తంతును కొనసాగిస్తున్నారు. పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చీకటి దందాలకు అధికారుల సహకరిస్తున్నారని ప్రజలు బాటంగానే చర్చించుకుంటున్నారు.

చీకట్లో కొనసాగుతున్న దోపిడీ 

కొద్ది రోజులు సైలెంట్ అయిన చీకటి దందాలు మళ్లీ మొదలయ్యాయి. రేషన్‌కార్డు లబ్ధిదారుడు వేలిముద్ర వేస్తే చాలు ఆ కుటుంబ సభ్యుల బియ్యాన్ని రేషన్ డీలరే తీసుకుని కిలోకి కొంత డబ్బులు చెల్లిస్తున్నారు. ఇలా జమ చేసిన బియ్యాన్ని ఎక్కువ రేటుకు అమ్మేస్తూ డీలర్లు కొత్త దందాకు తెర లేపారు. బియ్యాన్ని ఆటోలు, ట్రాలీల్లో రాత్రిపూట మిల్లులకు తరలిస్తున్నట్లు సమాచారం. పీఎస్‌కు కూతవేటు దూరంలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్నా.. కళ్లు ముందే ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. రేషన్ దుకాణాల్లో రెవెన్యూ అధికారుల తనిఖీలు నామమాత్రంగా మారాయి.

సహకరిస్తున్న అధికారులు 

ఆకేరు వాగు పరీవాహక ప్రాంతమైన కౌసల్యదేవిపల్లి గ్రామంలో అధికార పార్టీ నాయకులు ఇసుక ర్యాంపు ఏర్పాటు చేసి రెండు రోజులుగా ఇసుకను తరలిస్తున్న విషయం అధికారులకు తెలియకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పీడీఎస్, ఇసుక అక్రమ రవాణా గురించి అధికారులకు ఫోన్ చేస్తే అధికారులే ఫిర్యాదుదారుడి వివరాలు అక్రమార్కులకు తెలియపరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.


Similar News