తెలంగాణ నుంచి జలాలు వస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు..ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు

ఏడుకొండల వెంకన్న దర్శనం కోసం తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇచ్చే సిఫార్సు లెటర్లను టీటీడీ బోర్డు యాక్సెప్ట్ చేయవలసిందేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నమ్ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2024-10-23 16:50 GMT

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఏడుకొండల వెంకన్న దర్శనం కోసం తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇచ్చే సిఫార్సు లెటర్లను టీటీడీ బోర్డు యాక్సెప్ట్ చేయవలసిందేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నమ్ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ముడా చైర్మన్ గా లక్ష్మణ్ యాదవ్ బాధ్యతలు తీసుకున్న సందర్భంగా.. నిర్వహించిన సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్, ఆంధ్ర ప్రభుత్వంపై ఎన్నం శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యాలుచేశారు. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తిరుపతి వెళ్లిన సందర్భంగా.. తెలంగాణ ఎమ్మెల్యేలు ఇస్తున్న సిఫారసు లెటర్లను టీటీడీ బోర్డు సభ్యులు యాక్సెప్ట్ చేయకపోవడం పట్ల ఆంధ్ర ప్రభుత్వంపై చేసిన ఘాటు వ్యాఖ్యానాలను ఎన్నం శ్రీనివాస్ రెడ్డి సమర్థించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలము తిరుపతి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటాం..మరి మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భక్తులు మా సిఫారసులను తెచ్చుకొని గౌరవంగా, భక్తిగా వెంకన్న దర్శనం చేసుకోవాలని ఆశిస్తారు. మరి వారికి తెలంగాణ ఎమ్మెల్యేలను, ఇతర ముఖ్య నాయకులు ఇచ్చే సిఫారసు లెటర్లను ఎందుకు యాక్సెప్ట్ చెయ్యరు అని ప్రశ్నించారు. దీనికంతటికి మూల కారణం మాజీ సీఎం కేసిఆర్, ఆయన కుటుంబ సభ్యులే కారణమని ఎన్నం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి నచ్చిన వాళ్లకు బోర్డు సభ్యులుగా అవకాశం ఇచ్చారు. తప్ప తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించలేదని కేసిఆర్ కుటుంబ సభ్యులే కాదు..లిక్కర్ కేసులో ఉన్నవారు సైతం అక్కడికి వెళ్లి ఫోటోలకు ఫోజులుకు ఫోజులు ఇచ్చారని ఆరోపించారు. తెలంగాణ ఎమ్మెల్యేలను అందరం త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి ఈ సమస్యను గురించి వివరించి.. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తెస్తామన్నారు. అప్పటికి అంగీకరించకుంటే మా తెలంగాణ నుండే కృష్ణ, గోదావరి జలాలు వస్తున్నాయి అన్న విషయాన్ని మర్చిపోవద్దని ఎమ్మెల్యే గుర్తు చేశారు. అవసరమైతే తెలంగాణ సత్తా చాటుతామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత రెడ్డి, వైస్ చైర్మన్ విజయ్ కుమార్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News