సమగ్ర ప్రణాళిక రూపొందించి కార్యాచరణ అమలు చేయాలి : కలెక్టర్ బీఎం సంతోష్
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర

దిశ,గద్వాల్ కలెక్టరేట్ : జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం, అలంపూర్ ఆధ్యాత్మిక/యాత్ర అవసరాలు, స్థిరమైన పర్యాటకాన్ని దృష్టిలో ఉంచుకొని సమగ్ర పునర్వ్యవస్థీకరణ ప్రధాన ప్రణాళికపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జోగులాంబ దేవస్థానం అభివృద్ధి కొరకు ఏర్పాటైన పర్యవేక్షణ అభివృద్ధి కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అలంపూర్ పునరుద్ధరణ ప్రణాళికను ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అలంపూర్ తెలంగాణలో ఏకైక శక్తిపీఠంగా ఉన్నందున, దీని ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని దేవాలయ అభివృద్ధితో పాటు పర్యాటక అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు,ఆలయ పరిసరాల అభివృద్ధి, సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. ప్రసాద్ పథకం భవనానికి నీటి సరఫరా కోసం మున్సిపల్ కమిషనర్, ఇంట్రా ఈ.ఈ,పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు నది నుంచి నీటి శుద్ధి విషయంపై ఫీల్డ్ విజిట్ నిర్వహించి,15 రోజుల్లో వ్యయ అంచనాలను సమర్పించాలన్నారు. ప్రసాద్ పథకం భవనాన్ని టూరిజం శాఖ అధికారులు వెంటనే దేవదాయ శాఖకు అప్పగించాలని సూచించారు. దేవాలయానికి అనుసంధానించే రహదారుల అభివృద్ధికి గాంధీ జంక్షన్ నుండి ఆలయం వరకు రహదారి వివరాలు సిద్ధం చేయాలని, మురుగునీటి కాలువ వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ను, భక్తులకు తాగునీటి సదుపాయం తో పాటు క్లాక్ రూమ్ ఏర్పాటు కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
హైదరాబాద్-కర్నూలు నుండి అలంపూర్ మార్గాల్లో దిశానిర్దేశం బోర్డులు, నంది, శివచత్రువుల్లో సూచికలు ఏర్పాటు చేయాలని, అలాగే బస్టాప్, ఆటోస్టాండ్ అభివృద్ధి, సైన్బోర్డులు, గోడలపై పెయింటింగ్ పనుల కోసం ఫీల్డ్ విజిట్ నిర్వహించి 15 రోజుల్లో లైన్ అంచనాలను సమర్పించాలని ఆర్అండ్బి శాఖకు ఆదేశించారు. ప్రస్తుత పార్కింగ్ ప్రాంతంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని, టాయిలెట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ రావు, అసిస్టెంట్ స్థాపతి గణేష్,ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, టెంపుల్ డిజైనర్ గోవింద హరి, ఏడీ ఆర్కియాలజీ నాగలక్ష్మి, ఈ.ఓ పురేందర్,డీపీఓ నాగేంద్ర, అలంపూర్ తహశీల్దార్ మంజుల,మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రావు, ఇరిగేషన్ ఈ ఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బీఎస్ ఈ వనజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.