కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై కుట్ర.. KTR సంచలన ఆరోపణలు

కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై కుట్ర చేస్తు్న్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-06-27 09:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై కుట్ర చేస్తు్న్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసింది. సింగరేణి పరిధి మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో ఆయన గురువారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కు అయి వాళ్లకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు.

లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కు అయి నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికుని అర్థమవుతోందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నాటి నుంచే పనిచేస్తున్నారని గుర్తు చేశారు. సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందన్నారు. సమ్మె కాలంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి అని తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతంగా పనిచేశాయన్నారు. హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గొప్పగా పని చేశాయని ప్రశంసించారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది బీఆర్ఎస్ పార్టీ విధానం అని క్లారిటీ ఇచ్చారు. ఉద్యమ కాలం నుంచి.. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే తమ విధానం అన్నారు. అందుకే ప్రైవేటు కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చిన పక్కకు పెట్టి... రైతు బీమాను ఎల్ఐసీకి ఇచ్చామని గుర్తు చేశారు. విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను బీహెచ్ఈఎల్‌కి అప్పగించామని క్లారిటీ ఇచ్చారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం పనిచేశామో ప్రతి సింగరేణి కార్మికునికి అవగాహన ఉందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నన్ని రోజులు తొమ్మిది సంవత్సరాలకు పైగా తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగారన్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు కేటాయించినప్పటికీ.. తట్టెడు తెలంగాణ బొగ్గును ఎత్తకుండా విజయవంతంగా అడ్డుకున్నామన్నారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం.. గెలిచి రెండు వారాలు కాకముందే బీజేపీ ఎంపీలు ఆ పార్టీ నాయకత్వం కలిసి తెలంగాణ బొగ్గు గనులను వేలంకు పెట్టాయని మండిపడ్డారు.

తెలంగాణ గొంతుక పార్లమెంట్లో లేదన్న భ్రమతోనే కాంగ్రెస్, బీజేపీలు ఈ కుటిల ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కానీ సింగరేణి కోసం ఆది నుంచి పోరాటం చేసి... సింగరేణిని బలోపేతం చేసిందే బీఆర్ఎస్ అన్నారు. సింగరేణి కష్టాల్లో ఉంటే కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న విషయం మర్చిపోతున్నారని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణిని కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 


Similar News