KTR: ఆ విషయం సీఎం రేవంత్‌కు తెలిసే ఉంటుంది

హైదరాబాద్‌లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.

Update: 2024-09-15 14:44 GMT

దిశ, తెలంగాణబ్యూరో: హైదరాబాద్‌లో తలపెట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్ట్‌(Pharmacity Project)ను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కోరారు. విధానపరమైన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయంగా నంబర్ వన్‌గా నిలిపే ఉద్దేశంతో ఫార్మా సిటీ అనే బృహత్తరమైన ప్రాజెక్ట్‌ను కేసీఆర్(KCR) ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఫార్మాస్యూటికల్స్(Pharmaceuticals) ఉత్పత్తుల్లో దేశంలోనే 40 శాతం వాటా కలిగి ఉందన్నారు. వెయ్యికి పైగా లైఫ్ సెన్సెన్స్ కంపెనీలకు రాష్ట్రం అడ్డాగా ఉందని.. ఏటా 80 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను తెలంగాణ నుంచి తయారు చేస్తున్న విషయం సీఎంకు తెలిసే ఉంటుందన్నారు. ఇలాంటి కీలకమైన రంగాన్ని మరింత ప్రోత్సహిస్తే రాష్ట్రానికి ఆదాయం పెరగటంతో పాటు మన యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు.

ఈ ఉద్దేశంతోనే 9.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టే విధంగా తాము ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని భావించామన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైయితే అంతర్జాతీయంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఉత్పత్తుల్లో తెలంగాణ టాప్‌లో ఉంటుందని చెప్పారు. అదే విధంగా 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అందించవచ్చన్న భావనతో ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు గుర్తుచేశారు. దీనికి సంబంధించిన భూ సేకరణను కూడా పూర్తి చేశామన్నారు. అసలు ప్రాజెక్ట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించే ముందు భూములు ఇచ్చిన రైతులతో గానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థలతో గానీ ఎందుకు సంప్రదింపులు జరపలేదో చెప్పాలన్నారు. సరైన రోడ్ మ్యాప్ లేకుండా సీఎం చేసిన ప్రకటనతో ఫార్మా సిటీ భవితవ్యం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు. ప్రాజెక్ట్ కోసం రైతులు ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడతామని ప్రభుత్వం చెబుతుండటం కూడా రైతుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. ఒకవేళ ప్రభుత్వం ప్రాజెక్ట్ ను రద్దు చేయాలని భావిస్తే మాత్రం...ఈ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులకు వెంటనే ఆ భూములను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫార్మాసిటీ కోసం ఇచ్చిన భూములను ఇతర అవసరాలకు వాడుతామంటే రైతులతో పాటు బీఆర్ఎస్ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

పైగా ఫార్మాసిటీ కోసం ఇచ్చిన భూములను వేరే అవసరాలకు వాడితే న్యాయపరమైన సమస్యలు కూడా తప్పవని స్పష్టం చేశారు. ఫార్మా సిటీ విషయంలో మొండిపట్టుదలకు పోయి రాజకీయాల కోసం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీయవద్దని కోరారు. ఫార్మా సిటీ ప్రాజెక్ట్ పూర్తైతే రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందన్నారు. ఫార్మా సిటీని అత్యున్నత పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ప్లాన్ చేశామని, జీరో లిక్విడ్ డిశ్చార్జ్‌కు కట్టుబడి ఈ ప్రాజెక్ట్ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కానీ ప్రాజెక్ట్ ను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తే మాత్రం లైఫ్ సెన్సెన్స్ కు రాష్ట్రాన్ని కేరాఫ్ అడ్రస్ గా మార్చే అవకాశాన్ని మనం కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఉంటాయని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.


Similar News