కాంగ్రెస్‌కు కేటీఆర్ డెడ్‌లైన్

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీ నేతలతో నేడు ప్రత్యేక సమావేశమయ్యారు.

Update: 2024-09-18 15:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) బీసీ నేతలతో నేడు ప్రత్యేక సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. గతేడాది నవంబర్లో కాంగ్రెస్(Congress) కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ లోని హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు చేస్తామని ఇచ్చిన మాటను నెరవేరచ్చేదాక వదిలిపెట్టమని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెంటనే సమగ్ర కులగణనను నవంబర్ 10 లోపు పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధిస్తున్నామని అన్నారు. బీసీలకు ఐదేళ్లలోపు లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చి, బడ్జెట్ లో కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న బడ్జెట్లో కనీసం 25 వేల నుంచి 30 వేల కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్ కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అత్యంత వెనుకబడిన బలహీనవర్గాలు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, వెంటనే ఆ శాఖకు మంత్రి నియమించాలన్నారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వలేదు, పేద ప్రజల ప్రాణాలకు విలువలేదు అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రులు కరోనా సమయంలో వేలాది మంది ప్రాణాలను కాపాడాయి. అలాంటి ఆసుపత్రుల నిర్వహణను గాలికి వదిలేశారని అన్నారు. రాష్ట్రంలో విషజ్వరాలు, డెంగ్యూ జ్వరాలు ప్రబలుతున్నందున వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి శ్రద్ధ లేదు. కేవలం తమ బాధ్యతను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు.

జమిలి ఎన్నికల విషయంల కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో స్పష్టత ఇవ్వాలన్నారు. జమిలి ఎన్నికలను ఏ విధంగా నిర్వహించబోతుందో మరిన్ని వివరాలు తెలియ జేయాలన్నారు. జనాభా లెక్కల తో పాటు సీట్ల విభజన, రీ ఆర్గనైజేషన్ జరగాలని కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ పార్టీ అందరితో చర్చించాక విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని తెలియజేశారు. ఈ సమావేశంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.


Similar News