KTR: తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తాం: ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్

తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగించి.. తెలంగాణ తల్లిని సమున్నంతంగా ప్రతిష్టిస్తామని మాజీ మంత్రి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-28 07:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగించి.. తెలంగాణ తల్లిని సమున్నంతంగా ప్రతిష్టిస్తామని మాజీ మంత్రి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి భూమి పూజ సందర్భంగా 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన తల్లి సోనియా గాంధీని అని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు కౌంటర్‌గా కేటీఆర్ ట్విట్టర్‌లో బదులిచ్చారు. ‘సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలి దేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది. దొడ్డి దారిన పీసీసీ ప్రెసిడెంట్ అయి నేడు రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్న కపట ప్రేమ, అసలు రంగు అందరికీ తెలుసు. నీ ఆలోచనల్లో కుసంస్కారం, నీ మాటలు, అష్ట వికారం’ అంటూ ఫైర్ అయ్యారు.

‘తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో అట్లుంటది. మళ్లీ చెప్తున్నాం, రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం.. జై తెలంగాణ’ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది.


Similar News