KTR: పరిహారమా..? పరిహాసమా..? బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని, సర్కారు వంచనతో మళ్లీ ముంచిందని, ఇది పరిహారం కాదు.. పరిహాసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-10-10 07:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని, సర్కారు వంచనతో మళ్లీ ముంచిందని, ఇది పరిహారం కాదు.. పరిహాసమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పంటనష్టం సాయంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే.. వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయమని, 4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలు.. వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పంట నష్టం అంచనాలను తల్లకిందులుగా ఎందుకు మార్చేసారని, ఏకంగా 3లక్షల 35 వేల ఎకరాలు ఎట్లా ఎగిరిపోయాయని నిలదీశారు.

79,574 ఎకరాలకే కంటి తుడుపుగా పరిహారం ఇచ్చి మమ అనిపించడం దారుణమని, అపార నష్టంతో అల్లాడుతున్న రైతులను ఆదుకునే విషయంలోనూ ఉదారంగా వ్యవహరించలేరా? మానవత్వం ప్రదర్శించలేరా? అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 5.20 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందానికి రాష్ట్రం రిపోర్ట్ ఇచ్చింది నిజం కాదా? అని, ఇప్పుడు ఇంత భారీ కోతలా? అని అన్నారు. ఇక పెట్టిన పెట్టుబడి కొట్టుకుపోయి.. రాళ్లూ ఇసుక మేటలు వేసిన పొలాలను బాగుచేసుకోవడానికి మీరిచ్చే 10వేలు ఏమూలకూ సరిపోవని, అందులోనూ కుదింపులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని మండిపడ్డారు. అన్నదాత ఆపదలో వున్నప్పుడు ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని, ఆ బాధ్యత నుంచి తప్పించుకోకుండా నష్టం వాటిల్లిన ప్రతి ఎకరానికి పరిహారం అందించాలని కోరారు. ఇక రుణమాఫీలో దగా జరిగిందని, రైతు భరోసా జాడా పత్తా లేదని, వరదలు ముంచెత్తి నష్టాల్లో, కష్టాల్లో కూరుకుపోయిన రైతులకు అండగా నిలవట్లేదని, అన్నదాతపై ఎందుకీ వివక్ష అని కేటీఆర్ ఆరోపణలు చేశారు.


Similar News