కొండా సురేఖ vs కేటీఆర్.. నేడే కోర్టులో విచారణ

కాంగ్రెస్ నేత, తెలంగాణ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

Update: 2024-10-14 02:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత, తెలంగాణ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తనపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ఇటీవలే నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఈరోజు (సోమవారం) కోర్టులో విచారణ జరగనుంది. కొండా సురేఖకు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేసిన వీడియోలతో పాటు కీలకమైన మరో 23 రకాల ఆధారాలను కోర్టుకు కేటీఆర్ సమర్పించారని సమాచారం. ఇక ఈ కేసులో తన తరపు సాక్షులుగా బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, ఉమ, శ్రవణ్‌ల పేర్లను కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ తరపున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరావు కోర్టులో వాదనలు వినిపించనున్నారు. 

ఇదిలా ఉంటే ఇటీవల కేటీఆర్‌పై కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నాగచైతన్య, సమంతల విడాకులకు కారణం కేటీఆరేనని, ఆయన వల్లే ఎంతోమంది హీరోయిన్లు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పు బట్టింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి సమంత విషయంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ తర్వాత ప్రకటించారు. అయితే కేటీఆర్‌‌పై మాత్రం ఆమె తన ఆరోపణలను వెనక్కి తీసుకోలేదు. దీంతో కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు.

కాగా.. ఇదే విషయంలో అక్కినేని నాగార్జున కూడా కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనకుటుంబం పరువు తీసేలా వ్యాఖ్యలు చేశారని, ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా తాను మాత్రం న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు కూడా కోర్టులో నడుస్తోంది.


Similar News