పత్తి, మిర్చి కంటే.. ఆ పంట సాగుతో అధిక లాభం : మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో మంత్రి తుమ్మల పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

Update: 2024-10-21 05:23 GMT

దిశ, వెబ్ డెస్క్: పత్తి, మిర్చి పంటల సాగుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో మంత్రి తుమ్మల.. పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో పత్తి దిగుబడి తగ్గిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేసినా.. దిగుబడి తగ్గడానికి కారణం అదేనన్నారు. ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 17 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేస్తామన్నారు. అలాగే రైతులకు ఇబ్బంది లేకుండా రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. పత్తి రైతుల్ని మోసం చేసే ప్రైవేటు వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే.. రైతులకు కూడా మంత్రి తుమ్మల కొన్ని సూచనలు చేశారు. సంప్రదాయ పంటల నుంచి ఉద్యాన పంటల వైపు కూడా దృష్టి పెట్టాలన్నారు. పత్తి, మిర్చి స్థానంలో పామాయిల్ సాగు చేస్తే అధిక లాభాలొస్తాయని మంత్రి తెలిపారు.

ఎనుమాములలో మంత్రి కొండా సురేఖ

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.7,521 పలికింది. రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ కు తీసుకొచ్చి గరిష్ఠ ధరను పొందాలని మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఎనుమాముల మార్కెట్ కు వచ్చిన ప్రతి పత్తి బస్తాను కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. 


Similar News