ముళ్ళ పొదల్లో.. ఇందిరమ్మ పథకం..!

ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఉమ్మడి

Update: 2024-10-04 09:30 GMT

దిశ,కొత్తగూడెం రూరల్: ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పథకంలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గానికి దాదాపు 1100 పైగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయడం జరిగింది. విడతలవారీగా పాత కొత్తగూడెం రామవరం ప్రాంతంలో గృహాలు మంజూరు చేయగా కొందరు నిర్మించుకోగా మరికొందరు ఇండ్లను నిర్మించుకోలేకపోయారు. రామవరం ప్రాంతంలో ఎక్కువ మంది లబ్ధిదారులు స్లాబ్ కిటికీ లెవెల్ వరకు నిర్మించుకోగా బిల్లులు సకాలంలో రాని కారణంగా వాటిని పూర్తి చేసుకోలేకపోయారు. అలా ఇండ్లు సగం వరకే పూర్తి కావడంతో నిరుపయోగంగా మారాయి.

అలంకారప్రాయంగా ఉన్న ఇందిరమ్మ గృహాలు ముళ్లపొదల్లో దర్శనమిస్తున్నాయి. కొన్ని ఇండ్ల చుట్టూ పిచ్చి చెట్ల పూలవనంలో మునిగిపోయి కనిపిస్తున్నాయి. దాదాపు 20 సంవత్సరాలుగా రామవరం లో ఇందిరమ్మ గృహాలు ఉపయోగం లేకపోవడం వల్ల అవి శిథిలావస్థకు చేరుకొని బీటలు బారిన పరిస్థితి నెలకొంది. ఈ గృహాలను బీఆర్ఎస్ పాలనలో కూడా ఉపయోగంలోకి తేలేకపోయారు. కనీసం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రామవరంలోని ఉన్న ఇందిరమ్మ గృహాలకు మరమ్మత్తులు నిర్వహించి అసలైన లబ్ధిదారులకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

చెత్త డంపింగ్ యార్డ్ గా ఇందిరమ్మ కాలనీ...

కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ ప్రస్తుతం చెత్త డంపింగ్ యార్డ్ గా నిలిచింది. గతంలో లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో ఇందిరమ్మ ఇండ్లు కొందరు నిర్మించుకొని నివాసముంటుండగా మరికొందరు నిర్మించుకోలేక మధ్యలోనే నిర్మాణాలను వదిలేయడం వల్ల ఆ గృహాలు శిధిలావస్థకు చేరుకొని ముళ్ళ పొదల్లో మూలుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా ఉండటంవల్ల రామవరం ప్రాంతంలో సేకరించిన చెత్తను మొత్తం తీసుకువచ్చి ఇందిరమ్మ కాలనీలో పోయడం వల్ల అక్కడంతా డంపింగ్ యార్డ్ గా మారి పరిసర ప్రాంతాల ప్రజలకు దుర్వాసన వెదజల్లడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు.

కనుమరుగవుతున్న ఇందిరమ్మ కాలనీ రహదారి...

గతంలో రామవరం ప్రాంతంలో ఇందిరమ్మ కాలనీకి వేసిన రోడ్డు కనుమరుగవుతుంది. ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు పెరిగి రహదారి మూసుకుపోతుంది. ఇలా ఉండడం వల్ల నిరుపయోగం ఉన్న ఇందిరమ్మ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు సైతం నిలయంగా నిలిచినట్లుగా ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలనీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ కూడా అలంకారప్రాయంగా మిగిలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ సైతం నిరుపయోగంగా ఉంది. మరుగున పడ్డ రామవరం ఇందిరమ్మ కాలనీ ప్రజలు ఉండే విధంగా సదుపాయాలు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలని మధ్యతరగతి వర్గం వేడుకుంటుంది.

దళారుల చేతిలో ఇందిరమ్మ ఇండ్లు...

రామవరం ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న కొన్ని ఇందిరమ్మ ఇండ్లు దళారుల చేతిలో ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ఇండ్లు ప్రైవేటు వ్యక్తులకు కూడా అమ్ముకున్నట్లు ఆరోపణలు రావడం జరుగుతుంది. ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి కబ్జాకు గురి కాబడిన ఇందిరా మహిళలను స్వాధీనం చేసుకొని అసలైన లబ్దిదారులకు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

పేదలకు కేటాయించాలి: కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు

రామవరం లో నిరుపయోగంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను అసలైన నిరుపేదలకు కేటాయించాలి. శిధిలావస్థలో ఉన్న గృహాలను పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకు వెళ్తా.

ప్రభుత్వం సూచన మేరకు చర్యలు తీసుకుంటాం:తాసీల్దార్ పుల్లయ్య

రామవరం లో ఇందిరమ్మ ఇండ్ల గృహాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ సూచన మేరకు చర్యలు తీసుకుంటాం.


Similar News