అక్రమ అరెస్టులను ఖండించండి.. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్

మావోయిస్టు పార్టీలో పని చేస్తూ అరెస్టు అయి పది సంవత్సరాల కిందట జైలు నుంచి విడుదలై సాధారణ జీవి

Update: 2024-07-10 07:14 GMT

దిశ, భద్రాచలం: మావోయిస్టు పార్టీలో పని చేస్తూ అరెస్టు అయి పది సంవత్సరాల కిందట జైలు నుంచి విడుదలై సాధారణ జీవితం గడుపుతున్న 73 సంవత్సరాల వయస్సున్న మహ్మద్ హుస్సేన్‌ను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత పోలీసులు అరెస్టుగా చూపుతున్నారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు. ఆర్కే -1 మైన్ రోడ్ ప్రాంతంలో రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాలతో మందమర్రి సీఐ, ఎస్సై పెట్రోలింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి నల్లటి బ్యాగ్ భుజానికి వేసుకుని వెళ్తూ కనిపించగా అతనిని ఆపే ప్రయత్నం చేశారు. దీంతో అతడు అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకుని అతన్ని చెక్ చేయగా బ్యాగులో డాక్యుమెంట్స్, కరపత్రాలు, వాల్ పోస్టర్లు దొరికినట్లుగా, అతనిని విచారించగా నేను మావోస్టునని చెపుకున్నట్లుగా ఒక కట్టు కథను సృష్టించారని జగన్ ఆ లేఖలో ఆరోపించారు.

73 సంవత్సరాల వృద్ధుడు పారిపోతుండడం, పది సంవత్సరాలుగా జమ్మికుంటలో సాధారణ జీవితం గడుపుతున్న మహమ్మద్ హుస్సేన్ నేను మావోయిస్టుగా పెట్టుకోవడం అనేది ప్రజలు కూడా నమ్మని అబద్దాలతో కట్టు కథలుగా అల్లడం కేవలం ఫాసిస్టు పాలకులకు మాత్రమే సాధ్యం అవుతుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్గత ఒప్పందం చేసుకుని సింగరేణి బ్లాక్‌ల అమ్మకానికి సిద్ధమయ్యారని,దింతో కార్మికులు సింగరేణి బ్లాక్‌ల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారని ఈ ఉద్యమాలను అణిచివేయడానికి.. నాయకత్వం వహిస్తున్న వారిపై మావోయిస్టుల ముద్ర వేసి అరెస్టులకు పూనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామ్రజ్యవాదులు, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కొమ్ముకాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తున్నారని, మహమ్మద్ హుస్సేన్‌ను బేషరతుగా విడుదల చేయాలని ఈ సందర్భంగా జగన్ డిమాండ్ చేశారు.


Similar News