పిడుగుపాటుకు తండ్రి, కూతురు మృతి..

పిడుగుపాటుకు తండ్రి కూతురును మృత్యువాత పడిన విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

Update: 2024-10-23 04:30 GMT

దిశ, కారేపల్లి (కామేపల్లి) : పిడుగుపాటుకు తండ్రి కూతురును మృత్యువాత పడిన విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు మద్దులపల్లి గ్రామానికి చెందిన చింతల లింగస్వామి (58), కుమార్తె చింతల కావేరి (18) తమ పత్తి చేనులో కలుపు తీస్తుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వారు సమీపంలోని వేప చెట్టు కిందికి వెళ్లారు. వర్షం తక్కువ అవడంతో ఇంటికి వెళ్దాం అనుకున్నారు. అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగు పడింది. దీంతో తండ్రి కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని తండ్రి కూతుళ్లు మృతి చెందిన తీరును చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

కూతురు కావేరి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. దసరా సెలవులకు వచ్చి తండ్రికి చేదోడువాదోడుగా ఉండేందుకు చేనుకు వెళ్ళింది. అయితే ఆమె మృతి చెందడంతో తోటి విద్యార్థులు సైతం గుండెలు పిక్కటిల్లేలా విలపించారు. కాగా స్థానికులు కారేపల్లి సీఐ తిరుపతి రెడ్డి, కామేపల్లి తహసీల్దార్ సిహెచ్ సుధాకర్, ఎస్సై బి. సాయికుమార్ లకు సమాచారం అందజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద తీరును పరిశీలించారు. అనంతరం తండ్రి కూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి, కూతురు పిడుగుపాటుతో ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తుల కోరారు. కాగా మృతునికి భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.


Similar News