Seethakka : దీపావళి తర్వాత రుణమాఫీపై గుడ్ న్యూస్: సీతక్క

రుణమాఫీపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-26 09:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రైతు రుణమాఫీపై మంత్రి సీతక్క (Minister Sitakka) కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి తర్వాత మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ (loan waiver) చేస్తామని చెప్పారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు మూడు నెలల్లో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని మిగతా వారికి దీపావళి పండగ తర్వాత రుణమాఫీ చేస్తామన్నారు. ఏజెన్సీలో సాగుచేసుకుంటున్న గిరిజన రైతుల భూములకు పట్టాలు ఇస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎవరు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని మీకు భూమి పట్టాలు చేయిస్తామంటూ దళారులు వస్తున్నారని.. ఎవరిని నమ్మవద్దని సూచించారు. ప్రభుత్వమే అర్హులకు పట్టాలు ఇస్తోందని స్పష్టం చేశారు.

త్వరలో టోల్ ఫ్రీ నంబర్:

మంచినీటి సమస్యల ఫిర్యాదుల కోసం త్వరలో టోల్ ఫ్రీ (Toll Free)నంబర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. శనివారం మిషన్ భగీరథ (Mission Bhagiratha) కార్యాలయంలో అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. ఎక్కడా తాగు నీటి సరఫరాలో సమస్య రానీయ కూడదని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలన్నారు. రిజర్వాయర్లలో సరిపోయినంత నీటి నిలువలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థానికంగా ఉన్న నీటి వనరులపై మీద దృష్టి సారించాలని ప్రతి ఐదారు నియోజకవర్గాలను ఒక యూనిట్ గా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా ప్రజలు బోర్లు వేయించాలని, ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారని వేల కోట్లు ఖర్చుపెట్టిన తర్వాత బోర్ల మీద, ఆర్వో ప్లాంట్ల మీద ప్రజలు ఆధారపడుతున్నారని ఆ విధానం పోయేలా మిషన్ భగీరథ సిబ్బంది పని చేయాలన్నారు. ప్రతి ఇంటికి నల్లా నీరు అందేలా చర్యలు చేపట్టడంతో పాటు మిషన్ భగీరథ ట్యాంకులను తరచు శుభ్ర పరచాలని ఆదేశించారు. పైప్ లైన్ల లీకేజీ ని అరికట్టాలన్నారు. తాగునీటి సరఫరా పై అన్ని గ్రామాల నుంచి నెలవారీగా నివేదికలు తెప్పించాలని సూచించారు. నీటి సరఫరాలో సమస్య తలెత్తుతున్న ఉట్నూర్ వంటి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని డిప్యూట్ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏ చిన్న సమస్య తలెత్తినా పై అధికారులకు సమాచారం ఇవ్వాలని ఏ నెలలో ఏ పని చేయాలో క్యాలెండర్ ను రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఏఈ చేతిలో యాక్షన్ ప్లాన్ ఉండాలని, ఆయా గ్రామాల్లో ఏదన్నా సమస్యతో మిషన్ భగీరథ నీళ్లు రాక పోతే ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలన్నారు. మనిషికి నీరు అత్యంత కీలకం అని అందువల్ల కోట్ల మంది ప్రాణాలు మిషన్ భగీరథ సిబ్బంది చేతిలో ఉన్నాయన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గత సమ్మర్ లో నీటి ఎద్దడి వున్నా ఎలాంటి సమస్య లేకుండా తాగునీటిని అందించామని, 13,456 మంచినీటి సహాయకులకు శిక్షణ ఇచ్చామన్నారు.

Tags:    

Similar News