అందరికీ విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం

మధ్యంతరంగా ఆగిన విద్యను కొనసాగించేందుకు ఓపెన్ స్కూల్ అవకాశం కల్పిస్తుందని, దూర విద్యా విధానంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు.

Update: 2024-08-18 11:40 GMT

దిశ,వేములవాడ : మధ్యంతరంగా ఆగిన విద్యను కొనసాగించేందుకు ఓపెన్ స్కూల్ అవకాశం కల్పిస్తుందని, దూర విద్యా విధానంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు ఆదివారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఓపెన్ స్కూల్లో విద్యనభ్యసించి పొందిన సర్టిఫికెట్లు రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానంగా అన్ని ఉద్యోగ పదోన్నతుల్లో ఉపయోగపడతాయని అన్నారు. సీనియర్ అడ్వకేట్ దేవేందర్ మాట్లాడుతూ అక్షరాస్యతను పెంచుతూ పనితోపాటు చదువుకోవాలని వారికి ఓపెన్ స్కూల్ చక్కని అవకాశం అని పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ ఏఐ కో-ఆర్డినేటర్ మహేష్ మాట్లాడుతూ

     మహిళలకు, పలురకాల వృత్తుల్లో, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి, ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు, వివిధ సంఘాల సభ్యులకు, సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఓపెన్ స్కూల్ మంచి అవకాశమన్నారు. దీనిలో 10వ తరగతి తో పాటు ఇంటర్మీడియట్ మధ్యంతరంగా ఆగిపోయిన వారికి ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయిందన్నారు. పదవ తరగతిలో చేరేందుకు అభ్యర్థులు 14 సంవత్సరాలు నిండి బడి మధ్యలో మానివేసిన వారికి, చదవడం రాయడం వచ్చి డైరెక్ట్ గా పదవ తరగతి చదివేందుకు అవకాశం ఉందన్నారు. ఇంటర్మీడియట్ లో చేరేందుకు 10వ తరగతి పూర్తి చేసి, 15 సంవత్సరాలు నిండిన అందరూ అర్హులని పేర్కొన్నారు. ఇంటర్ మధ్యంతరంగా మానేసిన వారికి ఇదో సువర్ణ అవకాశమని వివరించారు. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు ఉందన్నారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెలాఖరు వరకు ప్రవేశాల గడువు ఉందని, కోర్సుల వివరాలకు 9248020207 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు. 

Tags:    

Similar News