మరో శ్రీలంకలా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంకలా మారబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంకలా మారబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ లో బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. అంతకుముందు రగుడు చౌరస్తా నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్, కొత్త బస్టాండ్ మీదుగా ఫంక్షన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చెన్నమనేని వికాస్ రావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే రూ.లక్షన్నర అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై అధిక భారం మోపుతుందని మండిపడ్డారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుభారాన్ని మోపాయన్నారు. అప్పులు తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను అమ్మడానికి చూస్తుందన్నారు. కులగణన పేరుతో రాష్ట్ర ప్రజల ఆస్తిపాస్తుల వివరాలను సేకరించి, అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టి రాష్ట్రంలో తుపాకీ రాజ్యం తేవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని, బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్య పోనవసరం లేదన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ చేసిన ఫోన్ టాపింగ్, డ్రగ్స్, ఫార్ములా ఈ రేస్, భూముల కుంభకోణం, కాలేశ్వరంతో సహా అన్ని స్కాముల్లో కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.
ఏది ఏమైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తాము రాష్ట్రంలో అధికారంలోకి రాగానే వాళ్ల లెక్కలు తేలుస్తామన్నారు. సిరిసిల్ల కార్యకర్తలు పోరాటయోధులని, కేటీఆర్ సిరిసిల్లకు వస్తుంటే ముందస్తు అరెస్టులు చేయించేవాడని గుర్తు చేశారు. పార్టీకి, పార్టీ సిద్ధాంతాలకు ద్రోహం చేస్తే తల్లికి ద్రోహం చేసినట్లేనని, అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపించామని, ఇక ముందు రాబోయేవి కార్యకర్తల ఎన్నికలేనన్నారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక లక్ష్యంతో పనిచేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈ సందర్భంగా బండి సంజయ్ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, ఉపాధ్యక్షుడు శీలం రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.