Ramagundam MLA : రామగుండాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతాను

రామగుండం నగరాన్ని ఉత్తర తెలంగాణలోని ఇతర పెద్ద నగరాలకు

Update: 2024-09-17 08:58 GMT

దిశ,గోదావరిఖని టౌన్: రామగుండం నగరాన్ని ఉత్తర తెలంగాణలోని ఇతర పెద్ద నగరాలకు ధీటుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే  రాజ్ ఠాకూర్ అన్నారు. మంగళవారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ బంగి అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నగరానికి పూర్వ వైభవం తీసుకు వచ్చే విధంగా, ప్రముఖ పారిశ్రామిక, వ్యాపార , విద్య , వైద్య కేంద్రం గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని అన్నారు. మూత పడిన జెన్కో విద్యుత్ సంస్థ ను అప్ గ్రేడ్ చేయించి సుమారు 8000 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల ప్రాజెక్ట్ ను మంజూరు చేయించుకోవడంలో రామగుండం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే సుమారు రూ 250 కోట్లతో రామగుండం నగరంలో అభివృద్ధి పనులు ప్రారంభం అయ్యాయని మరో రూ 100 కోట్లతో వివిధ రకాల పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు.

అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు రామగుండం నగరంలో జరుగుతున్న వివిధ వేడుకల నిర్వహణ ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు , ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ , సింగరేణి , ఆర్ ఎఫ్ సీఎల్ ,ఎన్పీడీసీఎల్ తదితర సంస్థల అధికారులు పాలు పంచుకొని విజయవంతం చేస్తుండడం సంతోషకరంగా ఉందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో నిజాం నవాబుల పాలన అంతమై తెలంగాణ లో ప్రజాస్వామ్య పాలన ఆరంభమైందని అన్నారు. ఎందరో అమరవీరుల త్యాగం , ప్రజల ఉద్యమాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలో ఐదు అమలవుతున్నాయని అన్నారు. మరొకటి త్వరలోనే అమలు కానుందని అన్నారు. ప్రజా పాలనలో భాగంగా వచ్చే నెలలో రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్,కార్పొరేటర్లు మహంకాళి స్వామి, బాల రాజ్ కుమార్, ముస్తఫా నాయకులు పాత పల్లి ఎల్లయ్య, అడ్డాల రామస్వామి, నగర పాలక సంస్థ ఈఈ రామన్, ఎగ్జామినర్ వేణు మాధవ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Similar News