నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Update: 2024-08-28 15:12 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధిః నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో సహా మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద తుపాకులు, వాటి తయారీకి ఉపయోగించే పరికరాల స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈమేరకు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేసి అమ్ముతున్నాడన్న నమ్మదగిన సమాచారం మేరకు గంభీరావుపేట ఎస్ఐ బుధవారం తన సిబ్బందితో గ్రామానికి వెళ్లారన్నారు. తన ఇంట్లో పనిముట్ల ఉపయోగించి నాటు తుపాకులు తయారు చేస్తుండగా రాయలింగు శంకర్ ను పట్టుకొని, అతని వద్ద రెండు తుపాకి బ్యారెల్, తుపాకుల తయారు చేయడానికి వాడే రంపము, సుత్తి, కత్తి, ఆకు రాయి, డ్రిల్లింగ్ మిషన్, దూగోడ మిషన్, ఎయిర్ బుల్లోజర్ స్వాధీనం చేసుకొని నిందుతునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కేసు తదుపరి దర్యాప్తు ప్రారంభించగా దర్యాప్తులో భాగంగా రాయలింగు శంకర్ వద్ద నాటు తుపాకులు కొనుగోలు చేసి జంతువుల వేటకు ఉపయోగిస్తున్న రాయలింగు చంద్రమౌళి, శాతవేణి హరీష్, లోగిడి గంగయ్య ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు తుపాకులు, నాలుగు ట్రిగర్ భాగాలు స్వాధీనం చేసుకొని, నిందుతులను రిమాండ్ కి తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నింధుతులను అరెస్ట్ చేసిన ఎల్లారెడ్డిపేట్ సీఐ శ్రీనివాస్, గంభీరావుపేట ఎస్ఐ రామ్మోహన్, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ లు రామ్మోహన్, రమాకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News