నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి

వన మహోత్సవం కార్యక్రమం కింద జిల్లాలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

Update: 2024-07-03 09:35 GMT

దిశ, పెద్దపల్లి : వన మహోత్సవం కార్యక్రమం కింద జిల్లాలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం ఆయన పెద్ద కల్వలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డితో కలిసి మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత, మొక్కల పెంపకం, పచ్చదనం ప్రాముఖ్యత విద్యార్థి దశ నుంచే పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో కళాశాల వద్ద వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు.

     ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అధికారులు జవాబుదారీతనంతో పూర్తి చేయాలని సూచించారు. పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల్లో అవసరమైనమేర మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన పూల మొక్కలు, ఇతర మొక్కలు కుండీలలో పెంచే విధంగా చూడాలని కోరారు. జిల్లాలో ఉన్న ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి, కేశోరాం సిమెంట్, రైస్ మిల్లుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించేలా చూడాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం జిల్లాలో 27 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించామని, వంద శాతం నాటిన మొక్కల సంరక్షణకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

     పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ మంత్రి చేతుల మీదుగా వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను అధిగమిస్తూ వన మహోత్సవం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని పోవాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి మాట్లాడుతూ చెట్ల సంరక్షణ ద్వారా భూ సంరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. పెద్దపల్లి పట్టణంలో మున్సిపల్ బడ్జెట్ లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కు కేటాయించుకొని ప్రస్తుత సంవత్సరం

    లక్షా 30 వేల మొక్కల పెంపకం లక్ష్యం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ జి.క్రిష్ణ, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, డీఆర్డీఓ రవీందర్, జెడ్పీ సీఈఓ నరేందర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జెడ్పీటీసీ రామ్మూర్తి, మున్సిపల్ కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


Similar News