విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి.. కలెక్టర్

తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలను బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Update: 2024-10-16 09:08 GMT

దిశ, తంగళ్ళపల్లి : తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలను బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి తరగతి గదిలో విద్యార్థులకు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టి వారి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి ? నాణ్యమైన భోజనం అందిస్తున్నారా ? ఇతర వసతులు ఎలా ఉన్నాయి అనే వివరాలను జిల్లా కలెక్టర్ స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గది భవనం పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొత్తగా 6 గదులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. టాయిలెట్స్ మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లు, లైట్లు ఉండేలా చూడాలన్నారు. వంట చేస్తున్న తీరును పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. కాంపౌండ్ వాల్ చుట్టూ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని ఎంపీఓను ఆదేశించారు. తనిఖీలో ఎంఈఓ రాజు, ప్రధానోపాధ్యాయులు శంకర్ నారాయణ్, వెంకటేశ్వర స్వామి, తదితరులు ఉన్నారు.


Similar News