Nerella Sharada : రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దిశగా ప్రజాపాలన

రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం దిశగా హైదరాబాద్

Update: 2024-09-17 10:06 GMT

దిశ,పెద్దపల్లి : రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం దిశగా హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజున మనం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం గా నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ముఖ్య అతిథి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ముఖ్య అతిథి తన సందేశాన్ని తెలియజేసారు. 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తారీఖు చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉందని, 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య భారత దేశంలో అంతర్భాగంగా మారిందని అన్నారు.

తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్ సమాజం ఉద్యమించిందని, ఆదివాసీ యోధుడు కొమురం భీం, దొడ్డి కొమురయ్య, రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీర వనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజా నేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందామని, తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజీ, మగ్దూం మొహియుద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబుల్లాఖాన్ వంటి సాహితీ మూర్తులకు ఘనమైన నివాళులర్పిద్దామని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ పథకాలను అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల వ్యవధిలోనే మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా బస్సు ప్రయాణం సాకర్యం కల్పించామని,రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ సరఫరా పథకాన్ని ప్రారంభించామని, రాష్ట్రంలోని పేదలకు గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించిందని అన్నారు.

రైతు సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, ఏకకాలంలో రుణమాఫీ అంశాన్ని ప్రస్తుత ప్రజా ప్రభుత్వం సుసాధ్యం చేసిందని, 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. మహిళలను ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటు అందించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని రూపొందించి, వచ్చే 5 సంవత్సరాల కాలంలో దాదాపు లక్ష కోట్ల రుణాలు మహిళలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజలందరికి సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ కేర్ పాలసీ రూపొందిస్తుందని, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని బలోపేతం చేసిందని మన జిల్లాలోని స్థానిక యువతకు ఉపాధి లభించే విధంగా వివిధ కోర్సులలో అవరమైన శిక్షణ అందించేందుకు ఎంపిడిఓ ప్రాంగణంలో ఆధునిక టాస్క్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, యువత డ్రగ్స్, గంజాయి వంటి వాటికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, దీన్ని నివారించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు.

అనంతరం ముఖ్య అతిథి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ మహిళా శిశు సంక్షేమ శాఖ, వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ప్రిన్సిపాల్ జిల్లా, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్యామ్ ప్రసాద్ లాల్, డీసీపీఎం.చేతన, ఆర్డీఓ బి.గంగయ్య, కలెక్టరేట్ ఏ. ఓ. శ్రీనివాస్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News