Kaleshwaram: ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటి తరలింపు ప్రారంభం

భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

Update: 2024-07-27 13:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు పంప్ హౌజ్ లోని రెండు మోటార్లను ఆన్ చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 20 టీఎంసీలుగా ఉన్న ప్రాజెక్టు సామర్థ్యంలో 17 టీఎంసీలకు చేరింది. వరద పెరిగే అవకాశం ఉండటంతో ఆ నీటిని మధ్య మానేరుకు తరలించాలని అధికారులు డిసైడ్ అయ్యారు. దీనికోసం నంది మేడారం పంప్ హౌజ్ లో రెండు మోటార్లను ప్రారంభించి 3,120 క్యూసెక్కుల నీటిని గాయత్రి పంప్ హౌజ్ కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మిడ్ మానేరుకు తరలించనున్నారు. మొదట 4, 6 మోటార్లను ఆన్ చేసిన అధికారులు, మరో మూడు పంపులను స్టార్ట్ చేసి నీటిని ఎత్తిపోయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడెం జలాశయం నుంచి ఎల్లంపల్లికి నీటి ప్రవాహం ఆగిపోగా.. ఎగువ ప్రాంతాల నుంచి దాదాపు 11 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో నీటిని తరలించే ప్రక్రియ మొదలు పెట్టారు. ప్రభుత్వం ముందు చెప్పినట్లుగానే మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజ్ లను ముట్టుకోకుండా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీటిని తరలిస్తున్నారు.

Tags:    

Similar News