జమిలి కంటే ముందు జన..కుల గణన, డీలిమిటేషన్ చేపట్టాలి: Addanki Dayakar

జమిలి కంటే ముందు జన..కుల గణన, డీలిమిటేషన్(నియోజక వర్గాల పునర్విభజన) చేపట్టాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు

Update: 2024-09-16 05:35 GMT

దిశ వెబ్ డెస్క్ : జమిలి కంటే ముందు జన..కుల గణన, డీలిమిటేషన్(నియోజక వర్గాల పునర్విభజన) చేపట్టాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ మనుగడ కోసమే జమిలి ఎన్నికల ప్రక్రియను బీజేపీ ముందుకు తెస్తుందని దయాకర్ విమర్శించారు. జమిలి ఎన్నికల నిర్వాహణ దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను, వాటి ప్రభుత్వాలను అణిచివేసేందుకే ఒకే దేశం.. ఒకే ఎన్నికల ప్రతిపాదనను బీజేపీ చేస్తుందన్నారు. జమిలి ఎన్నికలు బీజేపీ, ఆరెస్సెస్ రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. బీజేపీకి రాజకీయ లక్ష్యాల మీద ఉన్న ఆసక్తి రాజ్యాంగ పరమైన 2026లో నియోజక వర్గాల పునర్విభజన అమలు, జనగణన, కుల గణన వంటి వాటిపై లేదన్నారు. రాజకీయంగా నాల్గవ సారి ఏ విధంగా అధికారంలోకి రావాలి...ప్రతిపక్షాలను ఏ విధంగా అణిచివేయాలన్న కోణంలో బీజేపీ జమిలి ఎన్నికలను తీసుకోస్తుందని ఆరోపించారు.

కాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుపాలని, వాటి ఎన్నికలు పూర్తయిన వంద రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదనతో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సారధ్యంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. కోవింద్ కమిటీ ఇప్పటికే కేంద్రానికి జమిలిపై సిఫారసు చేసింది. జాతీయ లా కమిషన్ కూడా 2029 నుంచి జమిలి ఎన్నికలకు సానుకూలంగానే ఉండటంతో వన్ నేషన్..వన్ ఎలక్షన్ ప్రక్రియను ప్రధానీ మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకేళ్లేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకు ఎన్డీఏ పక్షాల నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత లేకపోవడం, కోవింద్ కమిటీ సూచించిన 18రాజ్యాంగ సవరణల్లో ఎక్కువ వాటికి రాష్ట్రాల ఆమోదం అవసరం లేకపోవడంతో 2029ఎన్నికల్లో జమిలి ఎన్నికల ప్రక్రియ అమలు చేయాలని బీజేపీ తలపోస్తుంది. అయితే అప్పటిలోగానే జన గణన పూర్తి చేయడం, ఇందులో కులగణన చేపట్టాలా వద్దా అనే అంశాలతో పాటు, నియోజక వర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు వంటి కీలక అంశాలపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Tags:    

Similar News