పెద్ద ఎత్తున అక్కడ భూముల కొనుగోలు.. ఇరిగేషన్ ఆఫీసర్ల ఫ్యూచర్ ప్లాన్!

‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే’ సామెతను రాష్ట్రంలోని ఇరిగేషన్ అధికారులను తూచ తప్పకుండా పాటించారు.

Update: 2024-07-15 01:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే’ సామెతను రాష్ట్రంలోని ఇరిగేషన్ అధికారులను తూచ తప్పకుండా పాటించారు. గత ప్రభుత్వం హయాంలో ఎక్కడెక్కడ ప్రాజెక్టులు నిర్మాణం అయ్యాయో.. భవిష్యత్తులో ఎక్కడెక్కడ డిమాండ్ రాబోతున్నదో ముందే పసిగట్టి ఆయా ఏరియాల్లో భూములు కొనుగోలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో మల్లన్నసాగర్, కొండపొచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. అయితే.. ఆ ప్రాజెక్టులకు అంకురార్పణ కాకముందే కొందరు ఇరిగేషన్ అధికారులు, ఇంజినీర్లు నిర్మాణ స్థలంలో వాలి ఆ చుట్టు పక్కల ల్యాండ్స్‌ను ఖరీదు చేశారు.

పలువురు పొలిటికల్ లీడర్లతో కలిసి పెద్ద ఎత్తున పర్చేస్ చేశారు. ఒక్కొక్కరు ఏకంగా 20 నుంచి 40 ఎకరాల వరకు కొన్నట్టు సమాచారం. ప్రాజెక్టు ప్లానింగ్ నడుస్తుండగానే కొందరు కొనుగోలు చేయగా.. పనులు ప్రారంభమయ్యాక మరికొందరు కొన్నారు. ఈ జాబితాలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నట్లుగా టాక్. ఆ రెండు ప్రాజెక్టులు సైతం గత ప్రభుత్వం టూరిజం హబ్‌గా చేసే ప్రయత్నాల్లో ఉండడంతో.. ఫ్యూచర్ ప్లాన్ కోసం అధికారులు ముందస్తుగా భూములను కొనుగోలు చేసినట్లుగా సమాచారం. భవిష్యత్తులో భూముల ధరలు డబుల్ అవుతాయనే ఉద్దేశంతో ఈ వ్యవహారానికి తెరలేపినట్లుగా ఆ శాఖలో టాక్ వినిపిస్తున్నది.

జ్యుడీషియల్ ఎంక్వయిరీలో వెలుగులోకి..

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై తాజా ప్రభుత్వం జ్యుడిషియల్ కమిటీతో విచారణ చేపట్టింది. అయితే.. ఆ కమిటీ విచారణలో ఒక్కో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా.. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన చాలా మంది అధికారులకు నిర్మాణ సంస్థలు పెద్ద ఎత్తున ప్రయోజనాలు కల్పించిందనే చర్చ జరుగుతున్నది. సదరు కంపెనీల ప్రోత్సాహంతో మెజార్టీ మంది ఇంజినీర్లు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ చుట్టుపక్కల విలువైన భూములను కొనుగోలు చేసినట్టు ప్రచారం సాగుతున్నది.

హోదా మేరకు నిర్మాణ సంస్థల బెనిఫిట్స్..

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దక్కించుకున్న నిర్మాణ సంస్థలు అటు రాజకీయ పార్టీలతో పాటు ఇటు ఇరిగేషన్ శాఖలో పనిచేసే అధికారులకు సైతం బెనిఫిట్స్ అందించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అధికారి హోదా మేరకు ఆ ప్రయోజనాలు చేకూర్చినట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టులో పనిచేసిన అధికారులకు ఏదో రకమైన ఫెవర్ చేశాయనే ప్రచారం ఉంది. సదరు సంస్థల ప్రోత్సాహంతోనే మెజార్టీ మంది అధికారులు ప్రాజెక్టుల చుట్టుపక్కల భూములు కొనుగోలు చేశారని టాక్ ఉంది. అయితే.. కేవలం వచ్చే జీతంతోనే అంత విలువైన భూములు కొనుగోలు చేయడం సాధ్యపడదనే చర్చ ఇరిగేషన్ వర్గాల్లో జరుగుతున్నది.

రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే బట్టబయలు

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్న జస్టిస్ చంద్రఘోష్ కమిటీ.. అధికారుల ఆస్తులను ఆరా తీస్తే అసలు విషయాలు బహిర్గతం అవుతాయనే టాక్ ఇరిగేషన్ వర్గాల్లో ఉంది. మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టు ఏరియాలో 2016–19 మధ్య జరిగిన భూ క్రయవిక్రయాలను ఆరా తీస్తే అసలైన దోషులు ఎవరో బయటికి వస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆ సమయంలో అక్కడ భూములను కొనుగోలు చేసిన అధికారులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? సొంత ఆదాయంతోనే కొనుగోలు చేశారా? లేకపోతే ఎవరైనా సహకరించారా? ఎందుకు సహకరించారు? అనే అంశాలు వెలుగులోకి వస్తాయని టాక్ ఉంది.

Tags:    

Similar News