HYDRA: మిషన్ ‘హైడ్రా’@ జన్వాడ ఫామ్ హౌజ్.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సర్వే
జన్వాడ ఫామ్ హౌజ్ ఇటీవల చర్చనీయాంశంగా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో: జన్వాడ ఫామ్ హౌజ్ ఇటీవల చర్చనీయాంశంగా మారింది. చెరువును ఆక్రమించి భవనాన్ని నిర్మించారన్న ఆరోపణల నేపథ్యంలో హైడ్రా కూల్చివేయడం ఖాయమనే గుసగుసలు మొదలయ్యాయి. దీన్ని ముందుగానే పసిగట్టిన భవనం నిర్వాహకుడు ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 99 నిబంధనలకు అనుగుణంగానే హైడ్రా నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వ డంతో రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్టుమెంటు అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి కొలతలు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. రెవెన్యూ శాఖ తరఫున సర్వేయర్, ఇరిగేషన్ శాఖ తరఫున ఇంజినీర్, మరికొందరు సిబ్బంది అక్కడి భవనం, చుట్టూ ఉన్న ప్రహరీ, చెరువు ఎఫ్టీఎల్ మార్కింగ్, బఫర్ జోన్ ఎంత వరకు విస్తరించి ఉందన్న దానిపై వివరాలను సేకరించారు.
గతంలో ప్రభుత్వం జారీచేసిన జీవో 111 ప్రకారం ఈ ఫామ్ హౌజ్ నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరిగాయో కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ గతంలో భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో గ్రామ నక్ష ప్రకారం మొత్తం వివరాలను ప్రభుత్వ సిబ్బంది సేకరిస్తున్నారు. వివరాలను సేకరించి రిపోర్టు ఇవ్వడం వరకే తమ పని అని, కూల్చివేతతో తమకు సంబంధం లేదని ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఇంజినీర్ వివరించారు. కాగా, ఫామ్హౌజ్ను కూల్చివేసే అవకాశముందంటూ నిర్వాహకుడు ప్రదీప్రెడ్డి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా.. ఎలాంటి స్టే ఉత్తర్వులు ఇవ్వకపోగా జీవో 99 ప్రకారం ప్రొసీజర్ను పాటించాలని సూచించింది.