యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి.. అక్కడికక్కడే మృతి

Update: 2024-08-29 04:09 GMT

దిశ, శేరిలింగంపల్లిః హైదరాబాద్ లో మరో సంచలన ఘటన జరిగింది. ప్రియురాలిపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనలో యువతి మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గతరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కు చెందిన దీపన తమాంగ్ (25) నగరానికి వచ్చి గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి తండా సమీపంలో తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటూ.. నల్లగండ్ల అపర్ణలో బ్యూటీషియన్ గా పని చేస్తుంది. ఆమెకు గత కొంత కాలం క్రితం కర్ణాటకకు చెందిన రాకేష్ తో పరిచయం ఏర్పడింది. అయితే రాకేష్ తనను పెళ్లి చేసుకోవాలంటూ దీపన తమాంగ్ వెంట పడుతూ వేధిస్తున్నాడు. ఆమె పెళ్లికి నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేష్.. ఆమెతో వద్ద మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాకేష్ క్షణికావేశంలో అక్కడే ఉన్న కూరగాయల కత్తితో యువతి పై దాడి చేశాడు. దాడిని అడ్డుకోవడానికి దీపన తమాంగ్ స్నేహితులు ప్రయత్నించారు. రాకేష్ వారిపై కూడా దాడికి యత్నించాడు. ఈ దాడిలో దీపన తమాంగ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె స్నేహితురాళ్లకు సైతం గాయాలయ్యాయి. అనంతరం అక్కడి నుంచి పారిపోయిన రాకేష్ మెయినాబాద్ సమీపంలో కనకమామిడి వద్ద ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. కరెంట్ పోల్ ఎక్కడానికి ప్రయత్నించగా.. విద్యుత్ షాక్ తో గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు కనకమామిడి సమీపంలోని హస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Similar News