మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు : సీపీ సుధీర్ బాబు
శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా అహర్నిశలు కృషి చేస్తూ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు
దిశ, చైతన్యపురి : శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా అహర్నిశలు కృషి చేస్తూ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ లో ఈ ఏడాది మొత్తం 25 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా క్రైమ్ సిబ్బంది, సిసిఎస్ ఎల్బీనగర్, ఐటీ సెల్ సహకారంతో అన్నిటినీ త్వరితగతిన విచారణ జరిపి అన్ని కేసులను పరిష్కరించిన అధికారులు, 18 మంది సిబ్బందిని ఆయన అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కమిషనరేట్ పరిధిలో సీసీటీవీలను విస్తృతంగా వినియోగించడం కూడా కేసుల విచారణలో అధికారులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారిని, చైన్ స్నాచర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్, ఎస్ఓటి డిసిపి మురళీధర్, అడిషనల్ డీసీపీ నంద్యాల నరసింహారెడ్డి, వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి, వనస్థలిపురం, మీర్ పేట డిఐలు తదితరులు పాల్గొన్నారు.