V.Hanmantha Rao : బీసీలు ఓట్లు వేస్తే అగ్రవర్ణాల వారు అధికారం చెలాయిస్తున్నారు

రేవంత్ రెడ్డి మంత్రి కూడా కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి

Update: 2024-09-14 09:50 GMT

దిశ, శేరిలింగంపల్లి : రేవంత్ రెడ్డి మంత్రి కూడా కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యాడని ఇది నేనెక్కడా చూడాలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ హనుమంతరావు అన్నారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఓబీసీ కుల గణన చేయాలని కోరుతూ శనివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ ఐపిఎస్ పూర్ణ చందర్ రావు, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, స్టూడెంట్స్ యూనియన్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. దేశంలో బీసీలు ఓట్లు వేస్తే అగ్రవర్ణాలు అధికారంలోకి వస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ అందరికి దేవుడని ఆయన వల్లనే అంతో ఇంతో హక్కులు పొందామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు, మంత్రి అవకుండా డైరెక్ట్ సీఎం అయిండని, ఆయన లాగా ఎవరూ కాలేక పోయారని అన్నారు. రిజర్వేషన్ మీద నిర్ణయం తీసుకుని ఆ క్రెడిట్ కూడా నీవే పొందాలని సలహా ఇచ్చారు. జై భీమ్ అంటే కాదు, ఆయన రాసిన హక్కుల కోసం పోరాటం చేయాలి. అంబేద్కర్ అందరి దేవుడని తెలిపారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని దీక్ష చేసిన రోజులు ఉన్నాయని గుర్తు చేశారు వీహెచ్.

బీసీ కుల గణనన చేయాలని, 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ వాదినే.. కానీ అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా అని వీహెచ్ స్పష్టం చేశారు. మాజీ ఐపీఎస్ పూర్ణచందర్రావు మాట్లాడుతూ.. దేశంలో వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థను మరింత గట్టిగా చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, కుల గణన చేస్తానని కాంగ్రెస్ చెప్పింది కానీ వారు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడా అమలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ, కర్ణాటకలో కూడా కుల గణన చేయలేదన్నారు. దేశంలో బీసీల పరిస్థితి చూస్తే ఎటు దారి లేకుండా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్య బీసీల సమస్యని వారికి న్యాయం చేయాలన్నారు. బీసీల సమస్య పరిష్కారం అయితే దేశంలో అన్ని సమస్యలు పరిష్కారం అయినట్లేనని, సగానికి పైగా ఉన్న బీసీల జనాభా 50 శాతం రిజర్వేషన్ లకు నోచుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ సీయూ విద్యార్థి సంఘాల నాయకులు, పలువురు లీడర్లు పాల్గొన్నారు.


Similar News