'ఆర్ఎంపీ, పీఎంపీలకు వైజ్ఞానిక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను ఇవ్వాలి'

ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించడంలో ఆర్ఎంపీ, పీఎంపీల పాత్ర చాలా ఉందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Update: 2024-07-10 13:26 GMT

దిశ, ముషీరాబాద్ : ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించడంలో ఆర్ఎంపీ, పీఎంపీల పాత్ర చాలా ఉందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఆర్ఎంపీ, పీఎంపీలకు వైజ్ఞానిక శిక్షణ ఇచ్చి అధికారిక సర్టిఫికెట్లను ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల అధ్యక్షుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, అతిథులుగా జన విజ్ఞాన వేదిక డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి, విజ్ఞాన దర్శని రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రాథమిక స్థాయిలో వైద్యం అందిస్తున్న గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీ, పీఎంపీల సేవలను మెరుగుపరచాలన్నారు. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను అమలు చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేసి వాళ్ళ స్థాయిలో వైద్యం అందే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందన్నారు.

పేద ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్న వాళ్లపైన కేసులు బనాయించడం, అరెస్టు చేయడం అనేది ఈ సమస్యకు పరిష్కారం కాదన్నారు. ప్రభుత్వాలు వాళ్లకు ఇచ్చిన జీవోలు అమలు చేసి వాళ్లకు పరిధి విధించి ఆ పరిధిలో వైద్యం చేసే విధంగా చేయడమే దానికి సరైన పరిష్కార మార్గమని చెప్పారు. దాడులు జరుగుతున్నాయని వైద్యవృత్తికి దూరంగా ఉండడానికి వీలులేదని అన్నారు. పది పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రిని కలిసి వారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి ఈ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషిచేస్తానని అన్నారు. రాష్ట్రంలోని సంఘాలన్నీ కలిసి ఒక వేదికగా ఏర్పడి ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడం సంతోషకరమన్నారు. ఇంకెవరైనా సంఘాల వాళ్ళు ఉంటే అంతా కలిసి వచ్చి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. మీ అందరికీ కావలసింది గుర్తింపు ఆత్మగౌరవం సర్టిఫికెట్ అదే జెండా కావాలన్నారు. కనుక అందరు కలిసి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. ఈ సమస్యను వాళ్లు వీళ్లు అనే కోణంలో చూడడం కాకుండా విజ్ఞాన దర్శిని, ప్రజా వైద్యం, ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెడికల్ కౌన్సిల్ వారిని, డాక్టర్స్ అసోసియేషన్స్ వారిని, ఆర్ఎంపీ, పీఎంపీ సంస్థలను కూర్చుండబెట్టి ఒక వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు.

అప్పుడే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ దిశలో ప్రయత్నం చేయాలని రమేష్ ను కోరారు. అసలే వర్షాకాలం వ్యాధులు ముదిరే సమయంలో ఇలాంటివి రావడం మంచిది కాదన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రిని కలిసి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కోదండరాం అన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల నాయకులు బాల బ్రహ్మచారి, పూలగం మోహన్, వెంకట్ రెడ్డి, హుస్సేన్, పంగ మల్లేశం, హరిబాబు, రాజమౌళి, రవిశంకర్, పిట్టల నాగేశ్వరరావు, గాదాసు శంకరయ్య, తాహెర్, రమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.


Similar News