ఢిల్లీలో కాంగ్రెస్‌కు మూటలు మోస్తున్న రేవంత్ : కేటీఆర్

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం నుండి మూటలు మోయడానికి మూసీ

Update: 2024-10-19 14:37 GMT

దిశ,చైతన్య పురి : ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం నుండి మూటలు మోయడానికి మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కే.తారక రామారావు విమర్శించారు. శనివారం ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ లో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. 26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవం అవుతుందని, కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు.

హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మూసీ బఫర్‌ జోన్‌లో ఉన్నవాళ్లను కబ్జాదారులని రేవంత్‌ ముద్ర వేయడం విడ్డురమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నాగోల్‌లో దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించామని చెప్పారు. ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతాయన్నారు. రేవంత్‌ రెడ్డి కొత్తగా చేసేదేంలేదని ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలన్నారు. మూసీనది హైదరాబాద్‌ కు ఒక వరమని, దానిని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలేనని చెప్పారు. హైదరాబాద్‌లో రోజూ 20 కోట్ల లీటర్ల మురికినీరు ఉత్పత్తి అవుతున్నదని తెలిపారు. దక్షిణాసియాలోనే వందశాతం మురుగు శుద్ధి చేసే నగరం లేదని వెల్లడించారు. మురుగునీటిని వంద శాతం శుద్ధి చేస్తున్నది ఒక్క హైదరాబాద్‌లోనేనని చెప్పారు. కేసీఆర్‌ హయాంలోనే ఈఘనతను సాధించామన్నారు. రూ. 3,800 కోట్ల ఖర్చుతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని నగరంలోని 54 నాలాల నుంచి మూసీలోకి మురికి నీరు వస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మించిన ఎస్టీపీలను రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో 57.7 కిలోమీటర్లు మూసీ ప్రవహిస్తుందన్నారు.

మూసీపై 15 చోట్ల బ్రిడ్జిలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. చారిత్రక, వారసత్వ సంపదను కాపాడుతూ ఆధునికంగా నిర్మించాలని నిర్ణయించామన్నారు. బ్రిడ్జిల నిర్మాణానికి రూ.545 కోట్లు మంజూరు చేసినట్లు మూసీపై రూ.10 వేల కోట్లతో భారీ స్కై ఓవర్‌ నిర్మించాలనుకున్నామని తెలిపారు. ఎంత శుద్ధి చేసినా మూసీ నీళ్లు తాగేవి కాదని చెప్పారు. అందువల్ల కొండపోచమ్మ సాగర్‌ నుంచి మూసీకి నీళ్లు తేవాలని నిర్ణయించామన్నారు. గోదావరి నుంచి నీళ్లు తెచ్చేందుకు రూ.1100 కోట్లతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఆ ప్రాజెక్టుకు గతేడాది మే 18న శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ వేశారని చెప్పారు. రూ.26 వేల కోట్లతో మొత్తం మూసీ పునరుజ్జీవం అవుతుందని కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రూ.3800 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీవరేజ్‌ ప్లాంట్ల ఏర్పాటును కేటీఆర్‌ చేపట్టారని అన్నారు. స్వచ్ఛమైన నీరు మూసీలోకి వదలాలని ఈ ఎస్టీపీలను నిర్మాణం చేసినట్లు తెలిపారు. మూసీపై 15 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని భావించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, బండారు లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, గీత పారిశ్రామిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, మాజీ కార్పొరేటర్లు చెరుకు సంగీత, రమావత్ పద్మా నాయక్, జిన్నారం విఠల్ రెడ్డి, కొప్పుల విఠల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, జీవీ.సాగర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


Similar News