NIMS Hospital : నిమ్స్ మరో ఘనత.. రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతం

హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రి మరో అరుదైన ఘనతను సాధించింది.

Update: 2025-03-25 11:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రి మరో అరుదైన ఘనతను సాధించింది. నిమ్స్ లో తొలిసారిగా రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్(Robotic Kidney Transplant) విజయవంతం అయిందని యూరాలజీ, అవయవ మార్పిడి బృందం మంగళవారం ప్రకటించారు. నల్గొండ జిల్లాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి 2017లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. అయితే అది సక్సెస్ కాకపోవడంతో తీవ్ర కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. కాగా ఆ వ్యక్తికి బ్రైన్ డెడ్ పొందిన వ్యక్తి నుంచి తీసిన కాడవెరిక్ కిడ్నీని రోబోటిక్ సర్జరీ ద్వారా మార్పిడి చేశారు. గతంలో శస్త్రచికిత్స జరిగినందున ఈ ఆపరేషన్ చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తయిందని వైద్యులు చెప్పారు. ఈ శస్త్రచికిత్సలో కొత్తగా మార్పిడి చేసిన కిడ్నీ వెంటనే పని చేయడం మొదలైందని, రోగి త్వరగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. ఈ ఏడాదిలో గత 2 నెలల్లో NIMS యూరాలజీ, రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం 41 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసింది.

దీంతో ఇప్పటివరకు నిమ్స్ వైద్యుల మొత్తం కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీల సంఖ్య 2,000కి చేరువైంది. ఈ రోబోటిక్ కిడ్నీ శస్త్రచికిత్స దక్షిణ భారతదేశంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన తొలి ఆపరేషన్ అని యూరాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ను ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ నేతృత్వంలో సీనియర్ ప్రొఫెసర్ మరియు HOD డాక్టర్ రామ్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధీరజ్ లు నిర్వహించారు. వీరికి సీనియర్ యూరాలజిస్టులు, అనస్థీషియా నిపుణులు, నెఫ్రాలజిస్టుల బృందం సహాయం అందించింది. NIMS డైరెక్టర్ డాక్టర్ బీరప్ప ఈ యూరాలజీ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

Tags:    

Similar News