గ్రేటర్ పరిధిలో 141 లోకేషన్లలో 242 ఎమర్జెన్సీ టీమ్స్ ఆన్ డ్యూటీ

నగరంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటోంది.

Update: 2024-09-03 02:56 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: నగరంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ పరిధిలోని మొత్తం 141 లోకేషన్లలో 242ఎమర్జెన్సీ టీమ్స్, 157 మొబైల్ టీమ్స్, 30 డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి 7 ఎమర్జెన్సీ టీంలు, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల నుంచి నాలుగు చొప్పున అదనపు ఎమర్జెన్సీ టీంలు రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నాయి. బల్దియా కంట్రోల్ రూమ్ లో 12మంది బృందం, డీఆర్‌ఎఫ్ కంట్రోల్ రూమ్ లో 10 మంది బృందం 24 X 7 పని చేస్తున్నాయి. వర్షంలో చిన్న పిల్లలు, వృద్ధులు ఒంటరిగా రోడ్డుపైకి రావద్దని, అవసరమైన సహాయానికి జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేగాకుండా వర్షం తగ్గాక వైరల్ ఫీవర్లు, ఇతర వ్యాధులతో ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నందున హెల్త్ క్యాంపుల ఏర్పాటుకు బల్దియా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. అత్యధికంగా 9 సెం.మీ వర్షపాతం నమోదు..

జీహెచ్ఎంసీ పరిధిలో గరిష్టంగా 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. అయితే వర్షంతో వాటర్ స్టాగ్నేషన్ కన్నా ఎక్కువగా చెట్లు పడిపోయాయి. వాటిని జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. అంతేగాక అత్యవసర సమయాల్లో ప్రజలకు అవసరమైన సహాయానికి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని విస్తృత ప్రచారం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో స్టాటిస్టిక్స్ ఎమర్జెన్సీ, డీఆర్‌ఎఫ్ టీంలు సంయుక్తంగా పని చేయడమే గాక ఇతర విభాగాల అధికారులందరూ క్షేత్ర పరిధిలో ఉండి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తం చేయడమే గాక ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

కంట్రోల్ రూంకు 141 ఫిర్యాదులు..

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు సోమవారం ఉదయం వరకు వాటర్ స్టాగ్నేషన్ కు సంబంధించి 141 ఫిర్యాదులు రాగా వీటిలో అధికారులు 140 క్లియర్ చేశారు. చెట్లు పడిపోయిన సంఘటనలకు సంబంధించిన 140 ఫిర్యాదులు అందగా వీటిలో 137 కూలిన చెట్లు తొలగించారు. గ్రేటర్ వ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన 596 భవనాలను గుర్తించగా 344 భవనాలపై చర్యలు తీసుకున్నారు. 129 భవనాలను ఖాళీ చేయించారు. మరో నాలుగింటికి సీల్ వేశారు. అధికారులు సంబంధిత యజమానులతో 107 వాటర్ ట్యాంకులకు మరమ్మతులు చేయించారు. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉంటూ గూడు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో భారీ వర్షాలు లేకున్నా ముందస్తుగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కార్యక్రమంలో సీసీపీ శ్రీనివాస్, (యూబీడీ) అడీషనల్ కమిషనర్ సునంద, కంట్రోల్ రూమ్ ఓ‌ఎస్డీ అనురాధ పాల్గొన్నారు.

కంట్రోల్ రూంను తనిఖీ చేసిన మేయర్

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను మేయర్ గద్వాల విజయలక్ష్మి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఓఎస్డీ అనురాధతో ఇప్పటివరకు నగరంలో పడిన వర్షపాతం, అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు, వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించినవి, హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీటి మట్టాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో మాడరేట్ వర్షాలు మాత్రమే కురుస్తాయని, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీహెచ్ఎంసీ కమిషనర్ మొదలు అన్ని స్థాయిల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవసరమైన చర్యలు చేపట్టారని తెలిపారు.


Similar News