పాతబస్తీలో 100 కిలోల లడ్డూ
వినాయక చవితిని పురస్కరించుకుని స్వామి వారికి ఎంతో ఇష్టమైన లడ్డూలకు భలే డిమాండ్ పెరిగింది.
దిశ,చార్మినార్ : వినాయక చవితిని పురస్కరించుకుని స్వామి వారికి ఎంతో ఇష్టమైన లడ్డూలకు భలే డిమాండ్ పెరిగింది. వినాయక చవితి రోజున ఇండ్లలో, గణేష్ మండపాలలో ఉంచిన లడ్డూను నైవేద్యంగా నివేదిస్తారు. దీంతో గణేష్ లడ్డూలకు భలే గిరాకీ పెరిగింది. అంతేగాకుండా గణేష్ మండపాలలో పెట్టిన లడ్డూను నిమజ్జనం రోజున వేలం పాట వేస్తుండడంతో వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో వేలం పాటలో వేసే భారీ లడ్డూలను ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. దీంతో నగరంతో పాటు పాతబస్తీలోని స్వీటు షాపులు కళకళలాడుతాయి.
పండుగకు 15 రోజుల ముందు నుంచే వినాయక విగ్రహాలతో పాటు ప్రత్యేకంగా తయారు చేసే భారీ లడ్డూలకు ముందస్తు ఆర్డర్లు ఇస్తుంటారు. లడ్డూలకు గిరాకీ పెరగడంతో పాటు వాటి రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పాతబస్తీ లాల్దర్వాజాలోని బాలానంద స్వీట్ షాపులో 100 కిలోల లడ్డూలు తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తిరుపతి నర్సింగ్రావు, తిరుపతి శివకుమార్లు తెలిపారు. తమ వద్ద రూ.10 లడ్డూ నుంచి రూ.40 వేల వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. కిలో రూ.400 చొప్పున లడ్డూను విక్రయిస్తున్నట్లు చెప్పారు. గత ఆరేళ్లుగా శివగంగానగర్లో పార్థీలతో పాటు, ఇబ్రహీంపట్నం నుంచి జైహింద్ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసే వినాయ విగ్రహాలకు 100 కిలోల లడ్డూను తమ వద్ద ఆర్డరు ఇచ్చి మరీ తయారు చేయించుకుంటారని పేర్కొన్నారు.