Floods Heart Breaking : కంట్లో ఎడతెగని కన్నీరు.. గుండె తరుక్కుపోతుంది: హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Update: 2024-09-02 09:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు.. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు,కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడం పై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసుపెట్టి చర్యలు తీసుకోవాలని, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరాను పునర్దరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలని, ఆహారం నీరు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అసలే రాష్ట్రం విష జ్వరాలతో విలువిలలాడుతోందని, వరదల వల్ల మరింత విజృంభించే ప్రమాదం ఉందని దీంతో అన్ని శాఖలు అప్రమత్తం కావాలని సూచించారు. 


Similar News