కేసీఆర్ కల అది.. మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి సంతోషం: హరీష్ రావు ఆసక్తికర ట్వీట్

కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ విషయమని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.

Update: 2024-09-11 05:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ విషయమని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ సహా గత నెలలో మెడికల్ కాలేజీల అనుమతి పొందిన ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా అనుమతులతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. దేశంలోనే రికార్డ్ నెలకొల్పిందన్నారు.

ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కోసం గత కేసీఆర్ సర్కార్ నిధులు, భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అనుమతులు మంజూరు చేసిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 8 కాలేజీలకు గాను కేవలం నాలుగు మెడికల్ కాలేజీలకు మాత్రమే గత నెల ఎన్ఎంసీ నుంచి అనుమతులు లభించాయని వెల్లడించారు. నిబంధనల ప్రకారం మౌలిక వసతుల ఏర్పాటు, బోధనా సిబ్బంది నియామకంలో ప్రభుత్వం విఫలమైందని ఎన్ఎంసీ అనుమతులు నిరాకరించిందన్నారు. జరిగిన తప్పును ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఎన్ఎంసీ నిబంధనల మేరకు అన్ని మౌలిక వసతులు, బోధన సిబ్బందిని సమకూర్చుకుంటామని అనుమతి కోరుతూ కేంద్రానికి అప్పీల్ చేసిందన్నారు. దీన్ని పరిశీలించిన కేంద్రం అప్పీల్ అంగీకరించి, 4 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలని ఎన్ఎంసీకి మార్గనిర్దేశం చేసిందని తెలిపారు. దీంతో ఒక్కో కాలేజీలో‌ 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం నాలుగు కాలేజీల్లో 200 సీట్లు ఈ అకడమిక్ ఇయర్ కు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య 4,090

కొత్త సీట్లతో కలుపుకొని తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనే మొత్తం సీట్ల సంఖ్య 4,090 కు చేరుకుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090 సీట్లకు చేరిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ఏటా పది వేల మంది పైగా డాక్టర్లను తయారుచేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. ఎంబీబీఎస్ సీట్లలో లక్ష జనాభాకు 22 సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం మనందరికీ గర్వకారణమన్నారు. వైద్యం, వైద్య విద్యలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేస్తే, తెలంగాణకు ఇక్కటి కూడా ఇవ్వలేదు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అయినప్పటికీ రాష్ట్ర సొంత నిధులతోనే కొత్తగా మొత్తం 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. అందుకు అనుగుణంగా వేగవంతమైన చర్యలు తీసుకున్నారని, తెలంగాణ ఏర్పాటుకు ముందు 70 ఏండ్లలో రెండు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు జరిగితే, స్వరాష్ట్రంలో 9 ఏండ్లలో 29 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించిందన్నారు.

వైట్ కోట్ రెవల్యూషన్‌కు నాంది

ఇది కేసీఆర్ ఘనత, బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత అని పేర్కొన్నారు. అరవై ఏళ్లలో సాధ్యం కాని అద్భుతాలను దశాబ్ద కాలంలోనే ఆవిష్కరించిందన్నారు. తెలంగాణ పిల్లలు వైద్య విద్య కోసమని లక్షలు ఖర్చు చేసి, చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్ వంటి దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు. వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్లకు నిలయంగా మారిన తెలంగాణ, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైట్ కోట్ రెవల్యూషన్ కు నాంది పలికిందన్నారు. ఇక్కడ ఎంబీబీఎస్ చదివిన వారు రాష్ట్ర ప్రజలకే కాదు, వివిధ దేశాల్లో వారు సేవలందించబోతున్నారని, తెలంగాణ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేయబోతున్నారన్నారు. పెరిగిన మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, డాక్టర్ కావాలనే కలను సహకారం చేసుకోవాలని కోరారు. మెడికల్ కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని, మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూస్తూ ప్రతి ఏటా ఎన్ఎంసీ అనుమతులు (రెన్యువల్) కొనసాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


Similar News