Harish Rao: పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోం.. హరీశ్‌రావు సెన్సేషనల్ కామెంట్స్

‘హైడ్రా’ పేరుతో హైదరాబాద్ మహా నగరంలో ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను కూల్చితే ఊరుకోబోమని మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-04 08:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘హైడ్రా’ (HYDRA) పేరుతో ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను కూల్చితే ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మహబూబాబాద్ జిల్లా (Mahbubabad District) తొర్రూరులో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో చెరువుల సంరక్షణ పేరుతో ‘హైడ్రా’ విధ్వంసం సృష్టిస్తుందని ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కక్షపూరితంగా ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చితే బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ (Declaration)లో ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం అమలవుతోందని ఆయన ఫైర్ అయ్యారు.

అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి రూ.12 వేల హామీ ఏమైందో సీఎం రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) చెప్పాలన్నారు. మూతపడిన చెక్కర కార్మాగారాలను తెరిపిస్తామని, పసుపు బోర్డును తీసుకొస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇక భూమి లేని నిరుపేద రైతులకు రూ.5 లక్షల రైతు భీమా పత్తా లేకుండా పోయిందని ఆరోపించారు. దసరాలోపు ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేయాలని.. ఎకరానికి రైతల ఖాతాల్లో రూ.7,500 జమ చేయాలన్నారు. ఇకనైనా కుంటి సాకులు చెప్పకుండా అందరికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


Similar News