Amit Shah వ్యాఖ్యలపై మంత్రి Harish Rao ఫైర్

కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి తన్నీరు హరీశ్ రావు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుంటే..

Update: 2022-08-23 12:49 GMT

దిశ, సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి తన్నీరు హరీశ్ రావు ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుంటే.. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలతో ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞత సభకు మంత్రి హరీష్ రావు హాజరై మాట్లాడారు. ఉపాధి హామీ పథకం డబ్బులు మంజూరు చేయడంలో కేంద్రం వైఫల్యం చెందిందన్నారు. ఉపాధి హామీ పథకంలో అనేక ఆంక్షలు పెట్టి రూ.1.12 కోట్ల ఉపాధి కూలీలకు ఇబ్బందులు చేసే విధంగా కేంద్రం కొత్త జీఓ తెచ్చిందని ఆరోపించారు. బడా బడా వ్యాపారుల పైన ఉన్న ప్రేమ ఉపాధి హామీ పథకం కూలీల మీద లేదని, ఉపాధి హామీలో రూ.10 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని సాక్షాత్తు కేంద్ర మంత్రి చెప్పిన విషయం గుర్తు చేశారు. ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం అని వ్యాఖ్యలు చేసిన అమిత్ షా మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. రైతు పంట కొనడంలో కొర్రీలు పెట్టి కేంద్రం బాధ్యత నుంచి తప్పుకుందన్నారు. అయినప్పటికీ రైతులు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ ధాన్యం మొత్తం కొన్నారన్నారు. దీనికి తోడు రైతుబంధు, రైతు భీమా అమలు చేస్తూ అన్నదాతలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.

బీజేపీని రద్దు చేయాలి

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ చెబుతున్నదని, ఉచితాలు రద్దు కాదు బీజేపీని మనం రద్దు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 218 మందికి బీడీ పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి హరీష్ రావు అందజేసి మాట్లాడారు. బీడీ కార్మికులపై కేంద్ర ప్రభుత్వం కక్ష్యగట్టి సంక్షేమ పథకాలు తొలగించిందన్నారు. బీడీ కార్మికుల గురించి ఆలోచించిన నాయకుడు ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమేనని, తెలంగాణలో 4 లక్షల మందికి బీడీ పింఛన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో బీడీ కార్మికులకు పింఛన్ సౌకర్యం లేదన్నారు. బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్టీతో ఆంక్షలు విధించిందన్నారు. దీంతో పని దొరకని పరిస్థితి నెలకొన్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలు అవలంభిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రజా వ్యతిరేఖ పాలనకు ప్రజలు చరగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News