బండి సంజయ్‌ను కలిసిన గ్రూప్-1 అభ్యర్థులు.. రిక్వెస్ట్ ఇదే..!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను గురువారం గ్రూప్-1 అభ్యర్థులు కలిశారు.

Update: 2024-06-20 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను గురువారం గ్రూప్-1 అభ్యర్థులు కలిశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం ప్రిలిమ్స్ నుండి 1:100 చొప్పున ఎంపిక చేసేలా చూడాలని నిరుద్యోగులు కోరారు. గత నాలుగేళ్లలో మూడు సార్లు గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగిందని మంత్రి ఎదుట నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా పట్టించుకోవడం లేదని వాపోయిన నిరుద్యోగులు

గ్రూప్ 1 పోస్టులు అత్యధికంగా ఉండటం వల్ల 1: 50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తే నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:75 చొప్పున ఎంపిక చేసిన విషయాన్ని నిరుద్యోగులు గుర్తు చేశారు. గతంలో వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 1:100 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేశారని నిరుద్యోగులు తెలిపారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే భారీ ఎత్తున ధర్నా చేయనున్నట్లు నిరుద్యోగులు తెలిపారు. నిరుద్యోగుల డిమాండ్ న్యాయమైనదేనన్న బండి సంజయ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1:100 చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగుల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.


Similar News