మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వం కొత్త టాస్క్.. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీలు

Update: 2023-09-08 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రభుత్వం కొత్త టాస్క్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ప్రభుత్వ కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రచారంగా వాడుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఈ నెల 15న 9 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ప్రారంభించనుంది. అందుకు ప్రతి జిల్లా కేంద్రంలో 20 వేల మందికి తగ్గకుండా భారీ ర్యాలీలు నిర్వహించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలను ఆదేశిలిచ్చారు. రాష్ట్రసచివాలయంలో శుక్రవారం మెడికల్ కాలేజీలను ప్రారంభించబోతున్న 9 జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ఈనెల 15న రాష్ట్రంలోని జనగామ, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, అసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఏకకాలంలో నూతన మెడికల్ కాలేజీలను ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నదన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువనున్నదన్నారు. మెడికల్ కాలేజీలు ప్రారంభించుకుంటున్న 9 జిల్లా కేంద్రాల్లో కనీసం15 నుంచి 20 వేల మందికి తగ్గకుండా భారీ ర్యాలీ నిర్వహించాలన్నారు.

ఒక మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొనే అవకాశం ఉందని, కామారెడ్డిలో హెల్త్ మినిస్టర్ పాల్గొంటారన్నారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఆ జిల్లా పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాన్ని ప్రజలకు వివరించాలని, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలని నేతలకు సూచించారు.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ ఆగ్రస్థానంలో ఉందన్నారు. 2014లో చిట్ట చివరి స్థానంలో ఉన్న తెలంగాణ, నేడు అగ్రస్థానంలోకి చేరిందన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే కనీసం ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని మండిపడ్డారు. మరోవైపు 50ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం తెలంగాణ ఉద్యమ ఒత్తిడితో నిజామాబాద్, ఆదిలాబాద్ లో మాత్రమే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు తెలంగాణ విద్యార్థులు వైద్య విద్య కోసం ఇతర రాష్ట్రాల నుంచి మొదలుకొని ఉక్రెయిన్ , రష్యా వంటి విదేశాలకు వెళ్లి చదువుకునేవారన్నారు. తెలంగాణ పిల్లలు స్వరాష్ట్రంలోని ఎలాంటి కష్టం లేకుండా వైద్య విద్యను అభ్యసించే గొప్ప సౌకర్యాన్ని కల్పించిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. తెలంగాణ ఆహార ఉత్పత్తిలోనే కాదు డాక్టర్ల ఉత్పత్తిలోనూ అగ్ర స్థానంలో ఉందన్నారు. ఈఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో 43శాతం తెలంగాణ రాష్ట్రంలోనే పెరిగాయన్నారు.


Similar News