ఫారెస్ట్ ఆఫీసులో దసరా దావత్.. పండుగపూట చిక్కుల్లో అధికారులు! (వీడియో)
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ బార్ అండ్ రెస్టారెంట్ను తలపించింది. కొందరు ఫారెస్ట్ అధికారులు మద్యం సేవించి జల్సా చేశారు.
దిశ, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ బార్ అండ్ రెస్టారెంట్ను తలపించింది. కొందరు ఫారెస్ట్ అధికారులు మద్యం సేవించి జల్సా చేశారు. దసరా సందర్భంగా మైసమ్మకు యాటను కోసి అటవీశాఖ చెందిన కొందరు అధికారులు ఎంచక్కా శుక్రవారం దావత్ చేసుకున్నారు. దావత్ చేసుకోవడంలో అభ్యంతరం ఏమీ లేనప్పటికీ.. జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయం ఆవరణలో మద్యం సేవించడం వివాదాస్పదంగా మారింది. అయితే, కొందరు టింబర్ సామిల్ డిపోల నిర్వాహకులు మందు దావత్కు స్పాన్సర్షిప్ చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
శుక్రవారం మధ్యాహ్నం నుండి ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో కొందరు సామిల్ నిర్వాహకులతో పాటు మరి కొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు మద్యం తాగుతున్నట్లుగా స్థానికులు తెలిపారు. విషయం మీడియా చెవిన పడడంతో కవరేజ్ కోసం వెళ్ళిన రిపోర్టర్లను చూసి సామిల్ టింబర్ డిపోల యజమానులతో పాటు కొందరు ఫారెస్ట్ సిబ్బంది అక్కడ నుండి జారుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై అక్కడే ఉన్న కొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై జిల్లా ఫారెస్ట్ అధికారి రవి ప్రసాద్ను వివరణ కోరగా ఈ విషయం తనకు తెలియదని ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.