KCR: పేదల జీవితాల్లో దసరా వెలుగులు నింపాలి

ప్రతి ఒక్కరూ ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు.

Update: 2024-10-11 17:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి ఒక్కరూ ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ‘దసరా’ను పురస్కరించుకొని దుర్గాదేవిని ప్రార్థించినట్లు తెలిపారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని చెడు మీద నిత్యపోరాటం చేస్తూ మంచి దిశగా విజయం సాధించాలనే జీవన తాత్వికతను ‘విజయ దశమి’ తెలియజేస్తుందన్నారు. దసరా రోజూ శుభసూచకంగా పాలపిట్టను దర్శించి, షమీ వృక్షానికి పూజ చేసి, జమ్మి ఆకును బంగారంలా భావించి పెద్దలకు సమర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవడం, గొప్ప భారతీయ సాంస్కృతిక ఆచారమని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరా పండుగకు ప్రత్యేక స్థానమున్నదన్నారు. అలాయ్ బలాయ్ తీసుకుని పరస్పర ప్రేమాభిమానాలను పంచుకోవడం ద్వారా దసరా పండుగ సందర్భంగా ప్రజల మధ్య సామాజిక సామరస్యం పరిఢ విల్లుతుందన్నారు. ప్రజలు తాము నిర్వర్తించే వృత్తులకు సంబంధించిన ఉత్పత్తి పరికరాలను, వినియోగించే వాహనాలను ఆయుధ పూజ చేసి గౌరవించుకునే గొప్ప సంప్రదాయం దసరా ప్రత్యేకత అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర పక్షిగా పాలపిట్టను,రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు ను గుర్తించడంతో పాటు పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు.

Read More : కేసీఆర్‌కు షాకిచ్చిన ఈడీ


Similar News