ప్రభుత్వ డాక్టర్లు... ప్రైవేట్‌గా చికిత్సలు! చోద్యం చూస్తున్న వైద్యాధికారులు

వైద్యో నారాయణ హరి అంటూ.. అలనాటి నుంచి డాక్టర్లను దైవంగా భావిస్తారు.

Update: 2024-09-20 02:24 GMT

దిశ, ఖమ్మం: వైద్యో నారాయణ హరి అంటూ.. అలనాటి నుంచి డాక్టర్లను దైవంగా భావిస్తారు. అలాంటి వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని విస్మరిస్తూ.. కాసుల కోసం కక్కుర్తి పడి.. వైద్యాన్ని పక్కా వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న కొంతమంది వైద్యులు ఇలాగే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సిన ఉన్నా.. 12 గంటల తర్వాత విధులకు డుమ్మా కొడుతున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే ఫోన్ చేయాలని పీజీ వైద్యులకు చెబుతూ.. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. ఎవరైనా అధికారులు ఆస్పత్రికి వస్తున్నట్లు తెలిస్తే వెంటనే వచ్చి.. విధుల్లో ఉన్నట్లు నటిస్తున్నారు. అంతేనా.. ఇక్కడి వచ్చే రోగులతో మెరుగైన వైద్యం కావాలంటే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటూ సొంత హాస్పిటళ్లకు రిఫర్ చేస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు బయట ఆస్పత్రుల్లో పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పనిచేస్తున్నా.. అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తున్నారు.

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కొంతమంది వైద్యులు ప్రైవేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన వైద్యులు ప్రైవేట్‌గా మాట్లాడుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి గతంలో వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్నపుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీలోకి వెళ్లినా కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు సుమారు 1500 నుంచి 2000 మంది రోగులు వివిధ కారణాలతో రాకపోకలు కొనసాగిస్తున్నారు. దాంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఎక్కువగా కేసులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వస్తుంటాయి. ఇంత పెద్ద ఎత్తున రోగులతో తాకిడిగా ఉన్న ఆసుపత్రిలో వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటేనే రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించవచ్చని ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది చెప్తున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత విధులకు డుమ్మాకొట్టి ప్రైవేట్‌ ఆసుపత్రులకు పరిమితమవుతున్నారన్న ఆరోపణలున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పీజీ చేస్తున్నా వైద్యులకు చెప్పేసి బయటకు వెళ్లిపోతున్నారు. ఏమైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే ఫోన్ చేయాలని సూచించి మరి బయటికి వెళ్లి ప్రైవేట్ క్లినిక్ లో ఓపీలు చూస్తున్నారు. ఎవరైనా అధికారులు ఆసుపత్రికి వస్తున్నారంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి విధుల్లో ఉన్నట్లు కనిపిస్తున్నారని సిబ్బంది బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

ప్రైవేటుకు వెళ్లాలంటూ సలహాలు..

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం కావాలంటే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాలని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఖమ్మం నగరంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు సగానికిపైగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకే చెందినవే. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి అని వసతులు ఏర్పాటు చేసిన ఇక్కడ కష్టం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లితే మంచిదని చెప్పి వారి సొంత ఆసుపత్రులకు రిఫర్లు చేస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి బయట నుంచి వచ్చిన డాక్టర్లు కూడా ఇదే తరహాలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఓపీ బేసిక్ పద్ధతిలో ఒప్పందం కుదిరించుకుంటున్నారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, పీడియాటిక్, గైనిక్, కార్డియాక్ డాక్టర్లు ఎక్కువ శాతం బయట ప్రైవేట్ ఆస్పత్రికి మక్కవ చూపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీలో ఉంటే రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని పాలకులు చెబుతున్నా అలాంటి వైద్యం ఇక్కడ కనిపించడంలేదు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు బహిరంగంగా ప్రైవేట్ ఆస్పత్రి బోర్డులో పేర్లు రాయించుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు యాజమాన్యం పీఆర్ఓలతో మార్కెటింగ్ చేసుకుంటూ దండిగా వ్యాపారం చేస్తున్నారు.

చోద్యం చూస్తున్న అధికారులు..

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు బయట ఆస్పత్రుల్లో పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పనిచేస్తున్నా... ఆస్పత్రి సూపరింటెండెంట్, కళాశాల ప్రిన్సిపల్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు చాలా ఫిర్యాదులు వచ్చినా వారు వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్లపై దృష్టి సారించి వారి అడ్డుకట్ట వేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేలా కృషి చేయాలని రోగులు కోరుతున్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తే చర్యలు..

డాక్టర్ కిరణ్ కుమార్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్

ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లు బయట ఆసుపత్రిలో ఓపీలు, చికిత్సలు చేయకూడదు. అలాంటివి ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటాం. గతంలో అనేకమార్లు చెప్పడం జరిగింది వారు పద్ధతిగా మార్చుకోకపోతే శాఖ పరమైన చర్యలకు గురికాక తప్పదు.


Similar News