Global Summit: ప్రతిష్టాత్మకంగా ఏఐ థీమ్‌తో గ్లోబల్ సమ్మిట్

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంశంపై గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు హైదరాబాద్ వేదికగా మారింది.

Update: 2024-09-05 02:39 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే ఫస్ట్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంశంపై గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు హైదరాబాద్ వేదికగా మారింది. ఫోర్త్ సిటీ (హైదరాబాద్ 4.0)లో ఏఐ సిటీని (హబ్) నెలకొల్పుతామంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ సమ్మిట్‌లో రోడ్ మ్యాప్‌ను రిలీజ్ చేయనున్నారు. ‘ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సు’ (మేకింగ్ ఏఐ.. వర్క్ ఫర్ ఎవ్రీవన్) అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సమ్మిట్‌కు అనేక దేశాల నుంచి దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరిగే ఈ సమ్మిట్‌ను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్‌ను ఉద్దేశించి ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభోపన్యాసం చేయడంతో పాటు వివిధ విభాగాలను ప్రారంభించనున్నారు.

ఏఐ విస్తరణ, అవకాశాలపై డిస్కషన్స్

ఏఐ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఖాన్ అకాడమీ అధినేత సల్‌ఖాన్, ఐబీఎం నుంచి డేనియేలా కాంబ్, ‘ఎక్స్‌ప్రైజ్’ కంపెనీ వ్యవస్థాపకుడు పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు, ఈ రంగం నిపుణులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. ప్రజల నిత్య జీవితంలో ఏఐ ఏ విధంగా తోడ్పడనున్నది, ప్రభుత్వం అందించే సేవల్లో ఎలా ఉపయోగపడుతుంది, భవిష్యత్తులో ఈ పరిజ్ఞాన విస్తరణకు ఉన్న అవకాశాలు, కొత్త ఆవిష్కరణలకు దోహదపడే చాన్స్ తదితరాలపై ఈ సమ్మిట్‌లో లోతుగా చర్చలు, ప్యానెల్ డిస్కషన్స్ జరగనున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానంగా సమాజం ముందుకు వస్తున్న ఏఐ వివిధ అంశాలపై చూపే ప్రభావం, దాని విస్తృత వినియోగంతో ఎదురయ్యే సవాళ్లు, నియంత్రించడానికి రూపొందించాల్సిన విధి విధినాలు, భవిష్యత్తు ప్రణాళికా రచనలో ఇది చూపే ప్రభావం.. ఇలాంటి అనేక అంశాలు ఈ సమ్మిట్‌లో చర్చకు రానున్నాయి.

ఏఐ హబ్‌గా రాష్ట్రాన్ని మార్చడంపై ఫోకస్

ఇప్పటికే ఈ పరిజ్ఞానంపై చేసిన పరిశోధనలు, వివిధ రంగాల్లో దాన్ని వినియోగిస్తున్న స్టార్టప్ కంపెనీలు డెమో ద్వారా వివరించనున్నాయి. ఏఐ వినియోగం ద్వారా మెరుగయ్యే సేవలను వివరించేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లతో పాటు వినూత్న ప్రాజెక్టుల ప్రదర్శన కూడా ఉండనున్నది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో నాలుగు వేదికలపై ఒకేసారి ఏఐ పరిజ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలపై హై ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్స్, డిబేట్స్, డెలిబరేషన్స్, ఇంటరాక్టివ్ సెషన్స్ చోటు చేసుకోనున్నాయి. దేశంలోనే ఫస్ట్ టైమ్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం దీని నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రాష్ట్రాన్ని ఏఐ రంగానికి హబ్‌గా తీర్చిదిద్దడం, ప్రత్యేకంగా ఏఐ సిటీని నెలకొల్పడం మొదలు ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నది.


Similar News