అనుకున్న దానికంటే అద్భుతమైన రెస్పాన్స్.. కాషాయమయమైన ఓరుగల్లు!

టీఎస్ పీఎస్సీ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వంతో బీజేపీ పోరాటానికి దిగింది. నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ‘నిరుద్యోగ మార్చ్’ పేరిట ర్యాలీలు నిర్వహిస్తోంది.

Update: 2023-04-15 13:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఎస్సీ లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వంతో బీజేపీ పోరాటానికి దిగింది. నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు ‘నిరుద్యోగ మార్చ్’ పేరిట ర్యాలీలు నిర్వహిస్తోంది. నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు తమకు అండగా బీజేపీ ఉందనే భరోసా నింపేందుకు ఈ మార్చ్‌కు కాషాయ పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఈ మార్చ్‌కు ఆయా పార్టీల అనుబంధ విభాగాలు సైతం మద్దతు తెలపడంతో ఓరుగల్లు పూర్తిగా కాషాయమయమైంది. బీజేపీ అనుకున్న దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. నిరుద్యోగులంతా భారీగా తరలివచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరుద్యోగ మార్చ్‌కు మద్దతు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి మొదలైన ఈ నిరుద్యోగ మార్చ్ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని తలపించింది. రాష్ట్రంలో ఉస్మానియా యూనిర్సిటీ తర్వాత అత్యంత ప్రతిష్ట కలిగిన వర్సిటీ కాకతీయ యూనివర్సిటీ. బీజేపీ చేపట్టిన ఈ మార్చ్‌తో ఓరుగల్లు మరోసారి తన పోరాట స్ఫూర్తిని చాటుకుంది. కాకతీయ యూనివర్శిటీ చౌరస్తా వద్ద ప్రారంభమైన ‘నిరుద్యోగ మార్చ్’తో పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది నిరుద్యోగులు, యువత, కార్యకర్తలు తరలిరావడంతో జన సంద్రంగా మారింది.

టీఎస్ పీఎస్సీ లీకేజీకి మంత్రి కేటీఆర్ బాధ్యుడని ఆయనను బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌తో పాటు, నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష నష్టపరిహారంగా చెల్లించాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలనే మూడు ప్రధాన డిమాండ్లతో బీజేపీ నిరుద్యోగ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఉమ్మడి జిల్లాలవారీగా తొలుత ఈ మార్చ్ నిర్వహించి ఆపై మిలియన్ మార్చ్ తరహాలో నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపట్టాలని ప్రణాళిక చేసుకుంది. కాగా, కాకతీయ యూనివర్సిటీ నుంచి ప్రారంభమైన తొలి మార్చ్‌కు బండి సంజయ్‌తో వేలాది మంది నిరుద్యోగులు కదం తొక్కారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలంటూ నినదిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 18వ తేదీన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ నుంచి నిరుద్యోగ మార్చ్‌ను బీజేపీ నిర్వహించనుంది.

బండితో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ

ఓరుగల్లులో నిరుద్యోగ మార్చ్‌లో పాల్గొన్న బండి సంజయ్‌తో సెల్ఫీలు దిగేందుకు యువత భారీగా పోటీ పడుతోంది. యువకులతో పాటు భారీగా యువతులు ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. దారి పొడవునా సంజయ్‌కి సాధరంగా స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా మార్చ్ ప్రారంభానికి ముందు వర్సిటీ వద్ద పలువురు బీఆర్ఎస్ నేతలు బీజేపీ ప్లెక్సీలు తగులబెట్టడంతో పోలీసులు అలర్టయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నిరుద్యోగ మార్చ్‌లో బండి సంజయ్‌తో పాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే.లక్ష్మణ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సహా పలువురు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News