Bhuvanagiri MP : మూసీ నది ప్రక్షాళనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

మూసీ నది ప్రక్షాళన కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.

Update: 2024-10-04 10:40 GMT

దిశ, చైతన్య పురి : మూసీ నది ప్రక్షాళన కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో శనివారం సాయంత్రం 4 గంటలకు జరుగబోయే మూసీ నది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వాలు విస్మరించిన మూసీ ప్రక్షాళనను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే రైతుల సహకారం అవసరమన్నారు.

అందరూ నడుంబిగించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం ఎస్టిపిలతో మురికి నీరును శుద్ధిచేసి గోదావరి జలాలతో నింపి, రైతులకు మంచినీరు అందించాలని లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. మూసీ నదిని శుద్ధి చేసి పరివాహక ప్రాంత ప్రజలకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళుతుంటే నేడు ప్రతిపక్షాలు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు రైతులను ప్రజలను తప్పుదోవ పట్టించి మూసి ప్రక్షాళన అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రతిపక్షాల కుట్రలు తిప్పి కొట్టాలని కోరారు. రేపు జరిగే సమావేశానికి హాజరై ప్రభుత్వానికి మద్దతు పలకాలని రైతులను కోరారు.


Similar News