గణేషుడి శోభాయాత్రకు విద్యుత్ శాఖ సిద్ధం! సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈనెల 17 వ తేదీన నిర్వహించే గణేష్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది.

Update: 2024-09-13 17:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఈనెల 17 వ తేదీన నిర్వహించే గణేష్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేందుకు విద్యుత్ శాఖ సిద్ధమైంది. అందులో భాగంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) తగిన ఏర్పాట్లు చేసిందని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నిర్వహించే ముఖ్య ప్రాంతం హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్ కంట్రోల్ రూంలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. నిమజ్జన కార్యక్రమంలో ఏర్పడే అదనపు లోడ్ కు సరిపడా మూడు 500 కేవీఏ ట్రాన్స్‌ ఫార్మర్లు, 315 కేవీఏలవి 31, 160 కేవీఏలవి 37 ట్రాన్స్ ఫార్మర్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. దాదాపు 55 కిలో మీటర్ల 11 కేవీ ఎల్‌టీ కేబుల్ ను, పోల్స్, కండక్టర్స్ వంటివి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లు తమ పరిధిలోని పెద్ద విగ్రహాలు ప్రతిష్టించిన మండపాలను, ఆ విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే వీధులను, రహదారులను క్షుణ్ణంగా పరిశీలించారని, రోడ్ క్రాసింగ్లు, వదులుగా ఉన్న తీగలు సరిచేశారని తెలిపారు. ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ఎర్తింగ్, అవరమైన చోట ఇన్సులేషన్ ఏర్పాటు, ఇనుప స్తంభాలు, ఫ్యూజ్ బాక్సులు ఉన్నచోట పీవీసీ పైపులు, ప్లాస్టిక్ షీట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండేందుకు నిత్యం సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ ఆదేశించారు.

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నిర్వహించే నిమజ్జన కార్యక్రమంలో విద్యుత్ సరఫరా తీరుతెన్నులను పర్యవేక్షించడానికి డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లను ఇన్ చార్జీలుగా నియమించినట్లు సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతానికి నంద కుమార్, ట్యాంక్ బండ్ ప్రాంతానికి నర్సింహులు, ఐడీఎల్ చెరువు, రంగారెడ్డి జోన్ కు కే.రాములు, బంజారాహిల్స్, సికింద్రాబాద్ సర్కిల్ కి నరసింహ స్వామి, సరూర్ నగర్ చెరువు ప్రాంతానికి బాలస్వామి, సంజీవయ్య పార్క్ నిమజ్జన పాయింట్ వద్ద బీ.రవి పర్యవేక్షిస్తారని సీఎండీ తెలిపారు. జోనల్ చీఫ్ ఇంజినీర్లు కే.సాయి బాబా, మేడ్చల్ జోన్, పీ.ఆనంద్, రంగారెడ్డి జోన్, చక్రపాణి, మెట్రో జోన్ పరిధుల్లో నిర్వహించే నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక కంట్రోల్ రూంతో పాటు, పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన జాయింట్ కంట్రోల్ రూంలలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. మండప నిర్వాహకులు, ప్రజలు విద్యుత్ భద్రత సూచనలు పాటిస్తూ, ఎక్కడైనా అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడినప్పుడు సమీపంలో ఉన్న విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ కు లేదా 100 లేదా 1912 కు కాల్ చేసి తెలియజేయాలని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు.


Similar News