Eatala: "ఇది హైడ్రా చేసిన హత్య".. బుచ్చమ్మ మరణంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

ఇది హైడ్రా చేసిన హత్యేనని, ఇకనైనా ప్రభుత్వం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఆపాలని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.

Update: 2024-09-28 09:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇది హైడ్రా చేసిన హత్యేనని, ఇకనైనా ప్రభుత్వం సృష్టిస్తున్న విధ్వంసాన్ని ఆపాలని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. 'హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య' అని ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన.. బుచ్చమ్మ మరణం తీవ్రంగా బాధిస్తుందని, కూకట్ పల్లి నల్లచెరువు హైడ్రా బాధితురాలు బుచ్చమ్మది ఆత్మహత్య కాదు ముమ్మాటికి సర్కారు హత్యనే అని వ్యాఖ్యానించారు. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలని, వారి ఉసురు ఊరికే పోదని, అనాలోచిత నిర్ణయాలు, అడ్డగోలు కూల్చివేతలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నల్లచెరువు దగ్గర వారికి ఉన్నది పట్టా భూమి అని, కష్టపడి ఇళ్లు కట్టి కూతుళ్లకు కట్నం కింద ఇచ్చుకున్నారని తెలిపారు. ఆ ఇళ్లు కూలగొడతామని అధికారులు బెదిరించడంతో ఆమె తనువు చాలించిందని, ఇది హైడ్రా చేసిన హత్యేనని ఫైర్ అయ్యారు. ఇక నల్లచెరువు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు బుచ్చమ్మ ఆమె కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ వచ్చి బోరున ఏడ్చారని, కూతుళ్లకు ఏం సమాధానం చెప్పుకోవాలని గుండెలు బాదుకుందని గుర్తు చేసుకున్నారు. బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని చెప్పి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలు ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంతేగాక హైడ్రా పేరిట ప్రభుత్వం సృష్టిస్తున్న విధ్వంసం ఇకనైనా ఆపాలని ఈటల హెచ్చరించారు.


Similar News