Deputy CM Bhatti: రూ.2 లక్షల రుణమాఫీపై కీలక ప్రకటన

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

Update: 2024-08-09 11:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి పలు గ్యారంటీలు అమలు చేయగా.. ఇటీవల లక్షన్నర రుణమాఫీ సైతం చేసేశారు. ప్రస్తుతం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయడం మిగిలింది. తాజాగా ఈ రూ. 2 లక్షల రుణమాఫీపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

‘ఇప్పటివరకు రెండు విడతలుగా రూ.12,289 కోట్లు రుణమాఫీ చేశాం. రూ.లక్షన్నర వరకు రుణం ఉన్న వారికి నేరుగా అకౌంట్లలో డబ్బులు వేశాం. రెండు విడతల్లో కలిపి 16 లక్షల 29 వేల కుటుంబాలకు రుణమాఫీ జరిగింది. మూడో విడత రుణమాఫీని ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు’ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాగా, జులై 18న తొలివిడతగా రూ. లక్షలోపు రుణాలను, జులై 30 రెండో విడత రూ.లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేశారు. మెుత్తం 6.40 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6.190 కోట్లు జమ చేశారు. రెండు విడతల్లో కలిపి మెుత్తం 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.12,224 కోట్లు జమ చేశారు. మూడో విడతలో మరో 20 వేల కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Tags:    

Similar News